తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు. ఇక దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ‘రైతు బంధు’ పథకం ప్రవేశ పెట్టారు కేసీఆర్. వడ్డీ వ్యాపారులు, దళారుల కబంధహస్తాల నుంచి రైతులను రక్షించేందుకు కేసీఆర్ సర్కారు దీన్ని తీసుకొచ్చింది. రైతులు చల్లగా ఉంటే..దేశం చల్లగా ఉంటుందన్న కాన్సెప్ట్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.
ఈ పథకానికి అనూహ్య స్పందన వస్తుంది..దేశ విదేశాల్లో సైతం తెలుగు వారు ఈ పథకం పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఈ పథకంలో తాము కూడా భాగస్వాములవుతామని వ్యాపారులు, ఎన్ఆర్ఐలు ఆసక్తిచూపుతున్నారు. తాను ఒక రైతుకు రూ.8 వేలు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఉప్పల్కు చెందిన అనిల్ అనే వ్యాపారి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కు తెలిపారు.
తైవాన్లో ఉన్న తెలంగాణకు చెందిన రామ్ అనే వ్యక్తి కూడా ఇలాగే స్పందించాడు. ముఖ్యమంత్రి రైతుల కోసం చేస్తున్న ఇంత మంచి పనికి అందరూ సహకరించాలని..రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ పథకానికి తాను కూడా ఎంతోకొంత సహకారం అందిస్తానని అన్నాడు. అలాగే సిరిసిల్లకు చెందిన రాజేందర్ అనే వ్యక్తి సైతం తన కుమార్తె అక్షిత కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.30 వేలు రైతు బంధు పథకానికి విరాళంగా ఇస్తానని తెలిపారు.
విజయవాడకు చెందిన పృథ్విరాజ్ అనే యువకుడు సైతం రైతు బంధుకు కొంత మొత్తాన్ని ఇస్తానని ట్వీట్ చేయడం విశేషం. ‘తాను కూడా కొంత రైతు బంధుకు మొత్తాన్ని ఇస్తానని, దాన్ని ఎలా అందజేయాలో తెలపాలని, ఇదో గొప్ప విప్లవాత్మక పథకం.. మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నా.. నేను ఏపీలోని విజయవాడకు చెందిన వ్యక్తినే అయినా, టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను ఇష్టపడతా’ అని ట్వీట్ చేశారు