కర్నాటక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో భారీ పరిణామాలు జరగబోతున్నాయంటూ బీజేపీ ఇస్తున్న సంకేతాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. టీడీపీని టార్గెట్ చేసి ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమని ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చేశారు ప్రజలు. అయితే అది ఎలా ఉండబోతోందనేదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం.
ఎన్టీయే నుంచి వైదొలగడం, మోదీ కేబినెట్ కు గుడ్ బై చెప్పడం లాంటి పరిణామాలు సహజంగానే బీజేపీకి కోపం తెప్పిస్తాయి. ఈ స్థానంలో మరే ఇతర పార్టీ ఉన్నా ఇలాగే వ్యవహరించడం ఖాయం. అయితే మిగిలిన పార్టీల్లా కాకుండా పగబట్టిన పాములా బీజేపీ అగ్రనాయకుల ద్వయం వ్యవహరిస్తుందనేది చాలా మంది చెప్పే మాట. అందుకే ఈ జోడీ ఏపీపై పగబట్టి ఎలాంటి కక్ష సాధించోబోతోంది.. అని ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఇది తప్పకుండా టీడీపీకి ఇబ్బంది కలిగించే అంశమే.
టీడీపీని దెబ్బకొట్టేందుకు బీజేపీ వేసే మొదటి ఎత్తుగడ.. ఆ పార్టీ కీలక నేతలపై కేసులు బనాయించడం. ఆ పార్టీలో కీలకంగా ఉండి ఆర్థిక వెన్నుదన్నుగా ఉండే వారిపై పాతకేసులను తోడడం, వాటిపై ఇప్పుడు చర్యలు తీసుకోవడం లాంటివి బీజేపీ ముందున్న ఫస్ట్ ఆప్షన్. ఇప్పటికే టీడీపీకి అండాదండా అందిస్తున్న పలువురు నేతలు, పారిశ్రామికవేత్తలను బీజేపీ గుర్తించినట్టు సమాచారం. ఇక రెండోది – ఐటీ దాడులు చేయడం. టీడీపీకి ఓ వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు అండాదండా అందిస్తుంటారు. అలాంటి వారిని టార్గెట్ చేసి దాడులు చేయడం ద్వారా వారి మూలాలను దెబ్బకొట్టవచ్చనేది ఆ పార్టీకున్న రెండో ఆప్షన్. ఇక మూడోది టీడీపీలో ప్రజాదరణ కలిగిన నాయకులను తమవైపు లాక్కోవడం. అయితే ఇది పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.
టీడీపీ ఏకస్వామ్య పార్టీ. రెండో వ్యక్తికి అందులో స్థానముండదు. కాబట్టి కిందిస్థాయి లీడర్లను చీల్చి తమ పార్టీలో చేర్చుకున్నా బీజేపీకి పెద్దఎత్తున జరిగే లబ్ది పెద్దగా ఉండకపోవచ్చు. ఏదైనా లీడర్ జాయిన్ అయితే ఆ నియోజకవర్గానికో లేదంటే రెండు మూడు నియోజకవర్గాలకో ఆయన ప్రభావం పరిమితం అవుతుంది. అంతేకానీ రాష్ట్రస్థాయిలో చంద్రబాబు అంతటి స్థాయిలో ప్రభావం చూపించేంత వ్యక్తి ఇప్పుడైతే ఆ పార్టీలో లేరు. కాబట్టి ఇదేమంత లాభం చేకూర్చే ఆప్షన్ కాదు.
అయితే.. బీజేపీ ఎత్తుగడలు ఏపీలో ఏమేరకు సక్సెస్ అవుతాయనేదే ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం. టీడీపీపైన కానీ లేదా నేతలపై కానీ బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకున్నా అది కక్షసాధింపుగానే పరిగణిస్తారు ప్రజలు. అది బీజేపీకి మరింత ఇబ్బంది కలిగించే అంశం. రాష్ట్రానికి అన్యాయం చేసిందికాక, ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడం బీజేపీకి మరింత చెడ్డపేరు తీసుకొచ్చే అవకాశం ఉంది.