తెలుగుదేశంపార్టీకి విరోధులు ఎక్కడో లేరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీకి అంతర్గత శత్రువుల ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి ప్రజల్లో పలుచన అయ్యారు. ఎమ్మెల్యేల బంధువులు నియోజకవర్గ ప్రజలను పీక్కుతిన్నారు. వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కోపగించుకున్నప్పుడు కొంతమేరకు తగ్గినట్టే తగ్గి ..ఆ తర్వాత మళ్లీ విజృంభించారు. వీటిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలుగు దేశం పార్టీలో కలవరం రేకెత్తించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ చేసిన విమర్శలతో కొంతమంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు బెంబేలెత్తారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే టీడీపీతో పొత్తు ఉండదని పవన్ చెప్పడం ఓ రకంగా మేలే చేసిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఆయన పార్టీ వైఖరి ఏమిటో ముందుగానే తెలిసిందంటున్నారు.
టీడీపీ గ్రాఫ్ తగ్గి జగన్ బలపడుతున్నారనిఅంతర్గత చర్చలలో కొందరు తెలుగు తమ్ముళ్లు అంటున్నారట! ఇదే విషయాన్ని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్రాజు కూడా చెబుతుండటాన్ని చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావించారు. అందుకనే చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలను కొంతరు నేతలు ప్రత్యర్థులకు లీక్ చేస్తున్నారన్న విషయాన్ని అధినాయకత్వం గుర్తించింది. మొన్నటి వరకు చంద్రబాబు నిర్వహించే అంతర్గత టెలీకాన్ఫరెన్స్ ల్లో.. సమీక్షల్లో పాల్గొన్న ఈ నేతలకు ప్రస్తుతం నో ఎంట్రీ బోర్డు పెట్టారు టెలీ కాన్ఫరెన్స్లో కూడా కాల్ కలపవద్దని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు దగ్గర జరిగిన అంతర్గత సమావేశం వివరాలు.. టెలీ కాన్ఫరెన్స్లో విషయాలను కొన్ని ఛానల్స్కు ప్రత్యర్ధి పక్షానికి చేరవేస్తున్నారని హైకమాండ్ కు కచ్చితమైన సమాచారం అందిందట.
పార్టీలోనే తిరుగుతూ మరికొందరు ముఖ్యమంత్రి... మంత్రులు, అధికారులపై చేస్తున్న విమర్శల వ్యవహారం కూడా చంద్రబాబు వరకు వెళ్లిందట. సమాచారాన్ని లీక్ చేయడం, నోటి దురదను ఎక్కువగా ప్రదర్శిస్తున్న నేతలతో పార్టీకి చిక్కులు వస్తున్నాయని గ్రహించడంతో చంద్రబాబు వీరందరికీ చెక్ పెట్టాలని నిర్ణయించారు. ప్రత్యర్ధుల కంటే ముందే అంతర్గత శత్రువులు చేస్తున్న వ్యాఖ్యలు పదిహేను రోజులుగా పార్టీలో హాట్టాపిక్ అయ్యాయి. దీని వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని హైకమాండ్ భావించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.