తిరుమలలో శుక్రవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన దాడి ఘటన సీరియస్ అయ్యేట్లే ఉంది. అమిత్ షా కాన్వాయ్ పై ఎప్పుడైతే దాడి జరిగిందో తర్వాత నుండి ఇటు బిజెపి అటు టిడిపి నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలను హెరెత్తించేస్తున్నారు. శనివారం ఉదయం బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు మీడియా సమావేశంలో చంద్రబాబుపై విరుచుకుపడిన విషయం అందరికీ తెలిసిందే. జరిగిన ఘటనకు చంద్రబాబుదే పూర్తి బాధ్యతగా వీర్రాజు మండిపడ్డారు. అంతేకాకుండా దాడి ఘటన చంద్రబాబుకు తెలిసే జరిగిందని ఆరోపించటం గమనార్హం.
వీర్రాజు ఆరోపణలు, విమర్శలతో అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన దాడి విషయంలో కేంద్రం సీరియస్ గా ఉందన్న విషయం అర్ధమైపోతోంది.
బిజెపి నేతలు చెప్పేదాని ప్రకారం అవుననే సమధనం వస్తోంది. అమిత్ షా పై దాడికి దారితీసిన పరిస్ధితులను కేంద్ర హోం శాఖ ఆరా తీసినట్లు సమాచారం. చిత్తూరు జిల్లా ఎస్పీతో కేంద్రహోం శాఖ ఉన్నతాధికారులు మాట్లాడి వివరాలు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా మొత్తం ఘటనపై పూర్తిస్ధాయి నివేదిక వెంటనే పంపాలని ఎస్పీని ఆదేశించినట్లు బిజెపి వర్గాలు చెప్పాయి. అదే సమయంలో తిరుపతిలోని బిజెపి నేతలు కూడా జాతీయ నాయకత్వానికి ఘటనపై పార్టీ పరంగా నివేదికను అందించినట్లు బిజెపి వర్గాలు చెప్పాయి. సహజంగానే వారి నివేదికలో టిడిపిని చంద్రబాబునే తప్పపడాతరన్న విషయం అందరూ ఊహిస్తున్నదే.
ఊహించని రీతిలో దాడి
అమిత్ షా తిరుమల పర్యటన సందర్భంగా స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కాన్వాయ్ పై హటాత్తుగా టిడిపి శ్రేణులు దాడి జరిపిన విషయం అందరికీ తెలిసిందే. అమిత్ ప్రయాణిస్తున్న కారుపై టిడిపి కార్యకర్తలు చెప్పులు, రాళ్ళు, కర్రలు విసిరారు. కాన్వాయ్ లో ని ఒకటి, రెండు కార్లకు అద్దాలు పగిలాయంటేనే దాడి ఏ స్ధాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. టిడిపి శ్రేణుల నుండి అమిత్త షా పై ఈ స్ధాయిలో దాడి జరుగుతుందని బిజెపి నేతలు అస్సలు ఊహించలేదు. దాంతో కమలంపార్టీ నేతలు ముందు బిత్తరపోయారు. తర్వాత వెంటనే తేరుకుని ఎదురుదాడి మొదలుపెట్టారనుకోండి అది వేరే సంగతి. మొత్తానికి టిడిపి శ్రేణులను అమిత్ షా దాకా పోకుండా అడ్డుకోగలిగారు. వారికి పోలీసులు కూడా తోడవ్వటంతో పెద్ద ఎత్తున గొడవ జరిగినా పలువురుని అదుపులోకి తీసుకుని అమిత్ షా ను ప్రశాంతంగా అక్కడి నుండి పంపించేశారు.
ప్రధాని తర్వాత స్ధానం అమిత్ షా దే
అమిత్ అంటే మామూలు వ్యక్తి కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోడి తర్వాత పార్టీలోలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా అంతటి ప్రాముఖ్యత కలిగిన నేత. జాతీయ స్ధాయిలో అత్యంత ప్రముఖుల్లో ఒకరు. అటువంటి నేతపై టిడిపి నేతల నుండి ఊహించని రీతిలో భౌతికదాడి జరగటమంటే మామూలు విషయం కాదు. పైగా ముందుగా అమిత్ షా పర్యటనకు సంబంధించి అవసరమైన సెక్యురిటీ కల్పించాలంటూ బిజెపి నేతలు ముందుగానే కోరినా పోలీసులు పట్టించుకోలేదట.
కావాలనే పోలీసులు నిర్లక్ష్యం చూపారా ?
బిజెపి నేతల మాటలను పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు ? రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని తమ సూచనలను పోలీసులు పట్టించుకోలేదని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. పోనీ దాడి జరిగిన తర్వాతైనా బాధ్యులపై చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. దాడికి బాధ్యులుగా బిజెపి నేతలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పైన కూడా పోలీసులు స్పందించలేదు. అదే విషయాన్ని పలువురు బిజెపి నేతలు పార్టీ జాతీయస్ధాయి నేతలకు ఫిర్యాదు చేయటం తర్వాత తెరవెనుక జరిగిన పరిణామాల వల్లే పోలీసులు యాక్షన్ లోకి దిగారన్న విషయం స్పష్టమవుతోంది.