ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్ర తరం అయిన సందర్భంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమల దర్శనానికి వచ్చారు. ఆయన శ్రీవారి దర్శనం చేసుకుని వస్తున్న సందర్భంగా కొంత మంది ఆయన కారుకు అడ్డు పడ్డారు. ఏపికి అన్యాయం చేశారంటూ..నిరసనలు తెలిపారు. కాగా, తిరుమలలో శుక్రవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన దాడి ఘటన సీరియస్ అయ్యేట్లే ఉంది. అమిత్ షా కాన్వాయ్ పై ఎప్పుడైతే దాడి జరిగిందో తర్వాత నుండి ఇటు బిజెపి అటు టిడిపి నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలను హెరెత్తించేస్తున్నారు.
శనివారం ఉదయం బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు మీడియా సమావేశంలో చంద్రబాబుపై విరుచుకుపడిన విషయం అందరికీ తెలిసిందే. జరిగిన ఘటనకు చంద్రబాబుదే పూర్తి బాధ్యతగా వీర్రాజు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా ఎస్పీతో కేంద్రహోం శాఖ ఉన్నతాధికారులు మాట్లాడి వివరాలు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా మొత్తం ఘటనపై పూర్తిస్ధాయి నివేదిక వెంటనే పంపాలని ఎస్పీని ఆదేశించినట్లు బిజెపి వర్గాలు చెప్పాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన రాళ్లదాడి ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఆయన శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...‘ అమిత్ షాకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాల్సి వస్తే ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఏపీ ప్రజలకు చెప్పాలి.
అలిపిరి ఘటనను చంద్రబాబు ఖండించారని, ఘటనకు పాల్పడినవారు ఎవరైనా సరే చర్యలు తప్పవంటూ హెచ్చరించారని గంటా తెలిపారు. ఈ ఘటన ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది కాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ఆవేదనను అలిపిరి ఘటన వ్యక్తీకరిస్తోందని అన్నారు. మోసం చేసిన మోదీ, అమిత్ షానే ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.