కర్ణాటక ఎన్నికల్లో బిజెపి నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కర్ణాటక రాష్ట్రంలోని జయనగర, ఆర్ ఆర్ నగహ మినహా 222 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరుగుతున్నాయి.అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అంతే కాదు రాష్ట్రంలో పలుచోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (ఈవీఎం)లో లోపాలున్నట్టు ఆ పార్టీ పేర్కొంది. ఈవీఎంలో లోపాలున్నట్టు ఆరోపణలు రావడంతో బనహట్టిలో రెండు గంటల పాటు పోలింగ్ నిలిచిపోయింది.
ఈవీఎంలలో తప్పులు దొర్లుతున్నాయంటూ కాంగ్రెస్ నేత బ్రిజేష్ కాలప్ప ట్విటర్లో వరుస ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన ట్విట్టర్ లో ‘‘బెంగళూరులోని ఆర్ఎంవీ సెకండ్ స్టేజ్లో మా తల్లిదండ్రుల అపార్ట్మెంట్ ముందు 5 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 2వ బూత్లో ఏ మీట నొక్కినా కమలం గుర్తుకే ఓట్లు పడుతున్నాయి. దీంతో ఆగ్రహించిన ఓటర్లు ఓటు వేయకుండానే తిరిగివెళ్లిపోతున్నారు..’’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘‘రామానగర, చామరాజ్పేట్, హెబ్బల్ సహా రాష్ట్రంలోని పలుచోట్ల ఈవీఎం, వీవీపీఏటీల్లో లోపాలున్నట్టు మాకు మూడు ఫిర్యాదులు అందాయి. కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తుంది..’’ అని బ్రిజేష్ మరో ట్వీట్లో పేర్కొన్నారు.
గతంలో కూడా ఈవీఏం లపై ఇలాంటి ఫిర్యాదులు ఎన్నో వచ్చాయి. కానీ ఎవరూ వాటిని సరిగా నిరూపించలేక పోయారు. తాజాగా కర్ణాటక పోలింగ్ లో ఈవీఏం ల వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, ముక్కోణపు సమరంగా భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. ఇవాళ ఉదయం నుంచి జోరుగా పోలింగ్ జరుగుతోంది. ఐదున్నర కోట్ల మంది ఓటర్లు ఇవాళ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.