టీడీపీ అధినేత చంద్రబాబును తక్కువగా అంచనా వేసే సొంత పార్టీ నేతలకు దిమ్మతిరిగి పోయేలా సమాధానం చెప్పారు బాబు. అయితే, నేరుగా కాకుండా ఆయన తన ఆదేశాలతోనే వారికి సమాధానం చెప్పారు. ఇప్పటికిప్పుడు్న్న పరిస్థితిని బట్టి అటు వైసీపీ అధినేత జగన్.. చంద్రబాబుకు ఎలాంటి ప్రత్యర్థో.. జనసేనాని పవన్ కూడా అంతే ప్రత్యర్థి! అయితే, టీడీపీలోని కొందరు సీనియర్లు.. ఈ రెండు పార్టీలకూ టీడీపీ సమాచారాన్ని మోసేస్తున్నారనే వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు తీసుకునే నిర్ణయాలు కూడా ఎప్పటికప్పుడు చేరవేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు తమ్ముళ్లు.
ఈ విషయంపై పెద్ద ఎత్తున సోషల్ సైట్లలో కూడా కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు స్పందించిన చంద్రబాబు. వీరికి ఖచ్చితంగా చెక్ పెట్టేందుకు బాబు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన కర్ర విరగకుండా.. పాము చావకుండా అన్నచందంగా వారికి చెక్ పెట్టారట. మరి విషయంలోకి వెళ్తే.. బాబు ఎంత కష్టపడుతున్నా ఆ విషయాలేవీ పట్టించుకోకుండా.. కొందరు తమ్ముళ్లు మాత్రం టీడీపీ గ్రాఫ్ తగ్గి పోతోందని, వైసీపీ అధినేత జగన్ బలపడుతున్నాడని అంతర్గత చర్చల్లో పేర్కొంటున్నారు. ఇక, ఇదే విషయాన్ని బీజేపీ నేత విష్ణుకుమార్రాజు పదే పదే చెబుతున్నారు. ఇదే విషయం ఇటీవల చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితులైన వారి వద్ద ప్రస్తావించారు.
అంతేకాదు, టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలను కొందరు నేతలు ప్రత్యర్థులకు లీక్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా వారికి వివరించారట. దీనికి అడ్డుకట్ట వేస్తానని.. ఎంతటి వారైనా పార్టీ లైన్కు కట్టుబడి ఉండాలని బాబు సూచించారట. అంతటితో ఆగకుండా.. అంతర్గత టెలీకాన్ఫరెన్స్ ల్లో.. సమీక్షల్లో గతంలో ఎదురు లేకుండా పాల్గొన్న కొందరు నేతలకు ప్రస్తుతం నో ఎంట్రీ బోర్డు పెట్టారు. అంతేనా.. టెలీ కాన్ఫరెన్స్లో కూడా కాల్ కలపవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
చంద్రబాబు దగ్గర జరిగిన అంతర్గత సమావేశం వివరాలు.. టెలీ కాన్ఫరెన్స్లో విషయాలను కొన్ని ఛానల్స్కు.. ప్రత్యర్ధి పక్షానికి చేరవేస్తున్నారని హైకమాండ్ కు కచ్చితమైన సమాచారం అందింది. ఫలితంగా వీరిని కట్ చేశారని ఉన్నతాధికారులు సైతం ఆఫ్ ది రికార్డుగా మీడియాకు చెబుతున్నారు. పార్టీలోనే తిరుగుతూ మరికొందరు ముఖ్యమంత్రి... మంత్రులు... అధికారులపై చేస్తున్న విమర్శల వ్యవహారం కూడా చంద్ర బాబు వరకు వెళ్లింది. సమాచారాన్ని లీక్ చేయడం, నోటి దురదను ఎక్కువగా ప్రదర్శిస్తున్న నేతలతో పార్టీకి చిక్కులు వస్తున్నాయని గ్రహించడం తో చంద్రబాబు వీరందరికీ చెక్ పెట్టాలని నిర్ణయించారు.
ప్రత్యర్ధులకంటే ముందే అంతర్గత శత్రువులు చేస్తున్న వ్యాఖ్యలు హాట్టాపిక్ అయ్యాయి. దీని వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని భావించిన చంద్రబాబు కీలక నేతలకు సైతం నో ఎంట్రీ బోర్డు పెట్టారని అంటున్నారు. వీరిలో ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారని అంటున్నారు అధికారులు. అయితే, వీరి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి బాబు తన జాగ్రత్త తాను తీసుకోవడాన్ని అసలు సిసలు నేతలు ఆహ్వానిస్తున్నారు.