జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా లోకి ప్రవేశించింది. ఈ జిల్లా లో జగన్ రెండు వేల కిలో మీటర్స్ పూర్తి చేయబోతున్నాడు. ఇది ఒక మహత్తర ఘట్టంగా చెప్పవచ్చు. భగ భగ మండే ఎండలను సైతం లెక్క చేయకుండా, ప్రతికూల వాతావరణం ను కూడా లెక్క చేయకుండా అకుంఠిత దీక్ష తో సాగిపోతున్నాడు. దీనితో జగన్ సంకల్పాన్ని చూసి జాతీయ మీడియా సైతం సాహో అంటుంది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టిన జగన్.. ఏలూరులో 2వేల కిలోమీటర్ల మైలురాయిని అందుకోబోతున్నారు.
మాదేపల్లి-ఏలూరి మధ్యలో జగన్ 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేసుకోబోతున్న ప్రాంతంలో 40అడుగుల భారీ పైలాన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పైలాన్ విజయగర్వం కాదు, అకుంఠిత దీక్షకు దర్పణం. గతేడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభిస్తే, చాలామంది నవ్వారు. ఎండాకాలం వచ్చేలోగా తూతూమంత్రంగా పూర్తిచేస్తారని ఎద్దేవా చేశారు. అప్పుడు వాళ్లకు తెలీదు జగన్ సంకల్పం ఏంటో..? ఇప్పుడు వాళ్లకు తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశం మొత్తం చూస్తోంది జగన్ వైపు.
ఇప్పటివరకు 75నియోజకవర్గాల్లో 122మండలాల్ని కవర్ చేశారు జగన్. వెయ్యికి పైగా గ్రామాల్లో నడిచారు. అడుగుపెట్టిన ప్రతి చోట అఖండ నీరాజనాలు అందుకున్నారు. జగన్ అడుగులో అడుగు వేసుకుంటూ స్వచ్ఛందంగా కొన్ని లక్షల మంది ప్రజలు పాదయాత్ర చేశారు. ఇలా సంపూర్ణ మద్దతుతో అప్రతిహతంగా సాగిపోతోంది ప్రజాసంకల్ప యాత్ర.