ఈ మద్య వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తను అతి దారుణంగా చంపిన భార్యల భాగోతం చూస్తుంటే..వెన్నుల్లో వణుకు పుడుతుంది. సాధారణంగా మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కట్టుకున్న భర్తలను ప్రియుడి మోజులో పడి అత్యంత అమానవీయంగా చంపించిన భార్యల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన సరస్వతి పెళ్లయిన పదో రోజే తన భర్త గౌరీ శంకర్ను అతి దారుణంగా చంపించింది.
అంతే కాదు తన భర్తను ఎవరో చంపారని..పోలీసులను పక్కదారి పట్టించే క్రమంలో అనుమానం వచ్చిన పోలీసులు నింధితులను తమదైన స్టైల్లో ట్రీట్ మెంట్ ఇవ్వడంతో అసలు నిజం బయట పడింది. అయితే వివాహమైన పది రోజులకే ప్రియుడితో కలిసి సొంత మేనబావ అయిన భర్తను దారుణంగా హత్య చేయించిన సరస్వతి హత్య కేసులో విస్తుపోయే మరో విషయం బయటపడింది. విజయనగరం ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త గౌరీ శంకర్ను హత్య చేయించడానికి నిందితురాలు బెంగళూరు ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు.
సరస్వతి ప్రియుడు శివతో కలిసి పెళ్లికి ముందే రూ.25 వేలు అడ్వాన్స్గా చెల్లించి హత్యకు కుట్ర పన్నినట్టు వివరించారు. ఈ సొమ్మును మొబైల్ యాప్ ద్వారా పంపారని తెలిపారు. ఒప్పందం చేసుకున్న ముఠా తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అప్పుడు విజయనగరానికి చెందిన మరో ముఠాతో డీల్ కుదుర్చుకున్నారని ఎస్పీ వివరించారు. కాగా, ఈ కేసులో సరస్వతి, ఆమె ప్రియుడు శివ సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.