గత కొన్ని రోజులు ఉత్తర భారతంలో వాతావరణం బీభత్సం సృష్టిస్తుంది. ఢిల్లీని మరోసారి ఇసుక తుఫాను ముంచెత్తింది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దుమ్ముధూళితో కూడిన ఈదురుగాలులు వీచాయి. ఢిల్లీతో పాటు గుర్గావ్, నోయిడాలలో కూడా ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. గుర్గావ్, ఫరీదాబాద్, ఘజియాబాద్లతో పాటు పలు ప్రాంతాల్లో 109 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలితో పాటు వర్షం కురవడంతో ఇద్దరు మృతిచెందగా, మరో 18మంది గాయపడ్డారు. ఢిల్లీలో ప్రతికూల వాతావరణం వల్ల 70 విమానాలను దారి మళ్లించారు.
పలు ప్రాంతాల్లో మెట్రో రైలు సేవలను నిలిపివేశారు. ఆదివారం మధ్యాహ్నం మొదలైన ఈ బీభత్సం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల చెట్ల కొమ్మలు, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుతు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏర్పాటు చేసు కున్న బహిరంగ కార్యక్రమం ఈదురుగాలుల బీభత్సానికి రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఉత్తర, తూర్పు భారతానికి నేడు ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భాకీ వర్షం, ఉరుములు, మెరుపులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే బెంగాల్, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో 70కిమీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. కాగా ఈ హెచ్చరికల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ముందస్తు చర్యలను చేపట్టారు. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, తుఫానులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.
జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం గంటకు 50–70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంది. ఈదురుగాలులు, తుఫానులు, ఉరుములు, మెరుపుల కారణంగా గత వారం కారణంగా ఐదు రాష్ట్రాల్లో 300పైగా మంది మంది గాయపడ్డారు.