ఎంతో ఉత్కంఠకు గురిచేసిన కర్నాటక పోలింగ్ లో భారతీయ జనతా పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతోంది. శనివారం పోలింగ్ తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారమైతే అంతా అయోమయంగానే ఉంది. దాదాపు నెలరోజుల ఎన్నికల ఉత్కంఠకు శనివారం దాదాపు తెరపడినట్లే. అంతిమ ఫలితం వెలువడాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. 15వ తేదీన ఫలితాలు వెలువడనున్న సంగతి అందరికీ తెలిసిందే. మీడియా సంస్ధల ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని బిజెపికి అనుకూలంగాను మరికొన్ని సంస్ధలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెబుతున్నాయి. అయితే, ఒకటి మాత్రం నిజం. ఏ సంస్ధ చేసిన ఎగ్జిట్ పోల్లో అయినా జెడిఎస్ మాత్రం మూడోస్ధానంలోనే నిలిచింది. కాకపోతే ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తుందని మాత్రం అర్ధమవుతోంది.
కాంగ్రెస్ కు 118 సీట్లు ?
ఎలాగంటే, కర్నాటకలోని 224 నియోజకవర్గాల్లో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా 122 సీట్లలో విజయం సాధించటం అవపరం. లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం తప్పదు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ వివరాలు ప్రకారం ఏ పార్టీ కూడా సొంతంగా అధికారంలోకి వస్తుందన్న అవకాశం కనబడటం లేదు. ఇండియా టుడే, టైమ్స్ నౌ, న్యూస్ ఎక్స్ లాంటి ఎనిమిది మీడియా సంస్ధలు జరిగిన ఎగ్జిట్ పోల్స్ లో ఇండియా టుడే, టైమ్స్ నౌ సంస్ధలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పింది. అందులో కూడా ఇండియా టుడే లెక్క ప్రకారం హస్తం పార్టీకి 118 సీట్లు వస్తాయి.
భాజపాకే ఎక్కువ స్ధానాలు
మూడు సంస్ధలు జరిపిన ఎగ్జిట్ పోల్స్ లో బిజెపి అధికారంలో వస్తుంది. దిగ్విజయ టివి, న్యూస్ ఎక్స్, రిపబ్లిక్ టివి అంచనాల ప్రకారం అధికారంలోకి రావటానికి బిజెపికే అవకాశం. అందులో కూడా రిపబ్లిక్ టివి అత్యధికంగా 1114 స్ధానాలు ఇచ్చింది. అంటే అటు కాంగ్రెస్ అయినా ఇటు బిజెపి అయినా సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేవనే అర్ధమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ వివరాలను బట్టి పై రెండు పార్టీలు కూడా జెడిఎస్ తో చేతులు కలపటమో లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్ధులుగా గెలిచే వారిపైనో ఆధారపడాల్సిందే.
జెడిఎస్ దే కీలక పాత్ర
ఎగ్జిట్ పోల్స్ ప్రకారమైతే మూడో స్ధానంలో నిలుస్తున్న జెడిఎస్ దే ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్రగా కనబడుతోంది. మొత్తం ఎనిమిది మీడియా సంస్ధల వివరాలు ప్రకారం రిపబ్లిక టివి జెడిఎస్ కు 43 సీట్లు వస్తుందని చెబుతోంది. మిగిలన సంస్ధలు కూడా జెడిఎస్ కు అటు ఇటుగా సుమారు 35 సీట్లు వస్తాయని చెప్పాయ్. అంటే జెడిఎస్ ది ఎంత కీలకపాత్ర ఎంతో స్పష్టమవుతోంది. స్వతంత్ర అభ్యర్ధులు కూడా అక్కడక్కడ గెలవచ్చు కానీ వారి పాత్ర పరిమితమనే చెప్పాలి. కాకపోతే కాంగ్రెస్ కు 118 సీట్లు వస్తుందన్న జోస్యం నిజమైతే ఓ పదిమంది ఇండిపెండెంట్ అభ్యర్ధులను గనుక కాంగ్రెస్ కలుపుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి.
బిజెపి+జెడిఎస్ దే ప్రభుత్వమా ?
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బిజెపి, జెడిఎస్ కలిస్తే వారికే అధికారం దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎలాగంటే, ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపికి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోయినా చివరకు అధికారం మాత్రం బిజెపినే చేజిక్కించుకుంది. ఎలాగంటే చిన్నా, చితక పార్టీలను, స్వతంత్రులను ఏదోరకంగా కలిపేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉండటమే బిజెపికి బాగా కలిసొస్తున్న అంశం. అదే పద్దతిలో కర్నాటకలో కూడా బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయ్.