ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన సచివాలయంలో భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో పవర్ప్రాజెక్టు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటు తదితర అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. కేంద్ర సంస్థలకు వివిధ ప్రాజెక్టుల కోసం ఇచ్చిన భూముల ధరలు తగ్గించాలనే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఉన్నారు.
గతంలో పలుమార్లు అనిల్ అంబాని రాష్ట్రానికి విచ్చేసారు. ఏపీ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అవ్వడంతో త్వరలోనే రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభించబోతున్నట్లు వినికిడి. నెల్లూరు జిల్లాలో పవర్ప్రాజెక్టు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటు తదితర అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు.
అంతకుముందు ఆయన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. గత వారం కేబినెట్ ఉప సంఘం సమావేశంలో భూముల కేటాయింపు, నిర్మాణాలపైన చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్ని సంస్థలకు భూములిచ్చారు, ఎన్ని నిర్మాణాలు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించలేదనే అంశాలపై ఆరా తీశారు.
మొత్తం 67 సంస్థల వరకూ ఇంకా ముందుకు రాని విషయం గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశమై నిర్మాణాల ఆలస్యానికి కారణాలు తెలుసుకోనున్నారు. ఎప్పటి నుంచి పనులు ప్రారంభిస్తారో స్పష్టత తీసుకోనున్నారు. ఈ నిర్ణయం తర్వాత కేంద్రం పరిధిలోని ఆర్బీఐ, నాబార్డు, సీపీడబ్ల్యూడీ, హెచ్పీసీఎల్, సీఐటీడీ తదితర సంస్థలకు భూముల ధరలు తగ్గనున్నాయి.