కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతాయంటూ.. బీజేపీ ఎంపీ, తెలుగు వాడైన జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇక నిజమయ్యేందుకు సమయం ఆసన్నమైంది. కర్ణాటకలో ఊహించని విధంగా అతిరథ మహారథులు, రాజకీయ దురంధరులకు కూడా అంతుపట్టని విధంగా బీజేపీ అక్కడ అప్రతిహత విజయం నమోదు చేసింది. కేవలం రెండంకెల ఆధిపత్యానికే పరిమితమై పోతుందని భావించిన ఆ పార్టీ.. ఇప్పుడు మూడెంకెల మెజారిటీ సాధించి.. ప్రభుత్వాన్ని సొంతగా ఏర్పాటు చేసుకునే స్థాయికి వడివడిగా అడుగులు వేస్తోంది.
ఈ పరిణామం బీజేపీకి ఎంత సంతోషాన్ని ఇస్తోందో ... అదే సమయంలో ఏపీ అధికార పార్టీ టీడీపీకి అంతే స్థాయిలో చెమటలు పట్టిస్తోంది. తాజగా బీజేపీ అధికార ప్రతినిధి, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ రాం మాధవ్.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. బాబు రాజకీయంగా సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమైందని ఆయన తన వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెబుతున్నారు. "కర్ణాటకలో విజయంతో దక్షిణాదిన మా జైత్రయాత్ర మొదలైంది... ఏపీ సీఎం చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు" అంటూ ట్వీట్ చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు వాళ్లు బీజేపీకి మద్దతు ఇవ్వకుండా చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నించారని.. అయితే తెలుగు వాళ్లు అత్యధికంగా ఉండే హైదరాబాద్ కర్ణాటకలోనే ఎక్కువ సీట్లు తమ పార్టీ సొంతం చేసుకుందన్నారు. తమ బలం 6 సీట్ల నుంచి 20కి పైగా పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. దక్షిణ భారతంలో తమ విజయ యాత్ర మొదలైందన్నారు రామ్ మాధవ్. ఈ క్రమంలోనే ఏపీలో నిన్న జరిగిన పరిణామాలను కూడా ఆయన ఉటంకించారు.
కాపు వర్గాన్ని బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ వర్గానికే చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, సీనియర్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. ఫలితంగా ఇటు కాపు వర్గం ఓట్లతో పాటు.. అటు కాంగ్రెస్ వర్గం ఓట్లను కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకునేందుకు చేసిన ప్రయత్నం తాజా ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఎన్నికలకు మరో ఏడాది ఉన్న సమయంలోనే బీజేపీ చేసిన ఈ ప్రయోగం అన్ని విధాలా ఫలిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఫలితంగా బాబుకు ఇక చుక్కలు కనిపించడం ఖాయమని చెబుతున్నారు.