పలు సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ కన్నడనాట కమలం వికసించించింది. సీఎం సిద్దరామయ్య ప్రజాకర్షక పథకాలు, లింగాయత్లకు ప్రత్యేక మైనారిటీ హోదా తీర్మానం.. తదితర అంశాలేవీ బీజేపీ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. మళ్లీ సిద్ధరామయ్యే సీఎం అవుతారని చెప్పిన ప్రీపోల్ సర్వేలు, ఏ పార్టీకి మెజారిటీ రాదనీ, కింగ్మేకర్గా జేడీఎస్ ఆవిర్భవిస్తుందని చెప్పిన ఒపీనియన్ పోల్ సర్వేల ఫలితాలను దాటుకుని బీజేపీ మ్యాజిక్ ఫిగర్ చేరుకునే దిశగా పయనిస్తోంది. ఇక బీజేపీ విజయానికి కారణాలేమిటో పరిశోధించే పనిలో పడ్డారు రాజకీయ విశ్లేషకులు.
అత్యంత కీలకంగా భావించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాడానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ లింగాయత్ లకు ప్రత్యేక మైనారిటీ హోదా కల్పించి, కేంద్రాన్ని ఇరకాటంలో పడేయాలని చూసిన, వారికి ప్రజాకర్షక పథకాలు ప్రకటించి వారి ఓట్లను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేత, సీఎం సిద్ధరామయ్య పన్నిన వ్యూహాలు బెడిసికట్టాయని చెబుతున్నారు. లింగాయత్ లు బలంగా ఉన్న 36 అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోవడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోందని అంటున్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన లింగాయత్ ల ప్రజాకర్షక పథకాలు పనిచేయలేదని తెలుస్తోంది. లింగాయత్ లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 16 అసెంబ్లీ స్థానాల్లోనే ముందుంది. అంతేగాకుండా కావేరీ నదీ జలాల వివాదాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం జాప్యం చేయడం కర్ణాటకలో ఆ పార్టీకి లాభించిందని పలువురు నాయకులు భావిస్తున్నారు. మరోవైపు మఠాల ప్రభావం ఓటర్లపై అధికంగా ఉండటంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఇది కూడా ఒక కారణమని అంటున్నారు. సెంట్రల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటక ప్రాంతాల్లో, ముంబై-కర్ణాటక, హైదరాబాద్- కర్ణాటక, బెంగళూరు నగరంలోనూ బీజేపీ మంచి విజయం సాధించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రచారం, అమిత్ షా రాజకీయ వ్యూహాలు, బళ్లారిలో గాలి సోదరుల ప్రభావం, యడ్యూరప్ప రాజకీయ వ్యూహాలతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన మెజారిటీ స్థానాల్లోనూ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోవడం గమనార్హం. కాంగ్రెస్ ఓటుబ్యాంకును చీల్చడంలో కూడా బీజేపీ వ్యూహం ఫలించినట్లు తెలుస్తోంది. ఏకంగా 16 మంది కాంగ్రెస్ మంత్రులతో పాటు స్పీకర్ కూడా ఓడిపోయారు.