రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలా వస్తాయో ఊహించ డమూ కష్టమే. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఎంతమాత్రమూ ఉండదు. ఇప్పుడు ఇదే విషయాన్ని కన్నడ నాటా జాతీయ పార్టీ కాంగ్రెస్ తరచి తరచి చర్చిస్తోంది. బీజేపీతాము ఒంటరిగానే ఎదిరించగలమని, తాము రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలే తమకు ప్లస్గా మారతాయని కాంగ్రెస్ భావించింది. ముఖ్యంగా సీఎం సిద్ద రామ య్యకు ఉన్న చరిష్మా చాలునని అనుకోవడం కాంగ్రెస్ను తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసింది. ఈ పరిణామమే ఇప్పుడు బీజేపీకి అంది వచ్చిన అవకాశంగా మారింది. మరోపక్క, సిద్దూ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ చేసి న ప్రచారం భారీ ఎత్తున ఆ పార్టీకి ఓట్లు కుమ్మరించింది.
ఇలా రాష్ట్రంలో పరిణామాలు ఎవరూ ఊహించని విధంగా మారిపోయాయి. అయితే, ఎన్నికలకు ముందుగానే పొత్తుల పై కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చి ఉంటే ఫలితాలు ఇలే ఉండేవి కావనే ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్, ప్రజాభిప్రాయ సర్వేలు కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంటుందని, హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశముం దని అభిప్రాయపడ్డాయి. కానీ, ఫలితాల్లో మాత్రం బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ దరిదాపుల్లో కూడా లేదు. కింగ్ మేకర్ అవుదామనుకున్న జేడీఎస్ ఆశలూ నిలబడలేదు. మొత్తానికి కన్నడ నాట కమలం వికసించడంతో కాంగ్రెస్, జేడీఎస్లో అంతర్మథనం మొదలైనట్టు కనిపిస్తోంది.
కర్ణాటకలో ఓటమిని అధికార కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. కాంగ్రెస్ ఘోరపరాభవానికి సిద్దరామయ్యే కారణమని జేడీఎస్ నిందిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివృద్ధి మంత్రమే తమను గెలిపించిందని బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ అతి ఆత్మవిశ్వాసమే కొంపముంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కనుక జేడీఎస్తో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకొని ఉంటే ఇలాంటి ఫలితం వచ్చేది కాదని అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వ్యక్తం చేశారు.
కర్ణాటకలో ఓటమికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు పెట్టుకొని ఉంటే.. ఫలితాలు చాలా భిన్నంగా ఉండేవని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక, గత రెండేళ్ల కిందటజరిగిన యూపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఇలాంటి పొరపాటే చేసింది. యూపీలో అధికార ఎస్పీతో పొత్తుకు సిద్ధమై.. బీఎస్పీని వదులుకుంది. దీంతో అప్పటి ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఏదేమైనా.. ప్రజల నాడిని పట్టుకోవడం, రాజకీయ ఎత్తులు వేయడంలో అతి పెద్ద జాతీయ పార్టీ ఘోరంగా ఓడిపోవడం విస్మయానికి గురి చేస్తోంది.