గత కొంత కాలంగా గోదావరి నదిలో లాంచి ప్రయాణాలు చేయాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రమాదాల నుంచి బయట పట్ట ఘటనలు మన కళ్లారా చూస్తున్నాము. నాలుగు రోజుల కిందట గోదావరిలో ప్రయాణికుల లాంచీ అగ్నికి ఆహుతైన ఘటన మరువకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. తాజాగా దేవిపట్నం మండలం మంటూరు వద్ద సుడిగాలి ధాటికి ఓ లాంచీ నదిలో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది.
పోలవరం నుంచి కొండ మొదలు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమయంలో 30మంది గిరిజనులు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, దేవిపట్నంలోని మంటూరు వద్ద లాంచి బోల్తా పడి సుమారు 25 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు తెలిసింది. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లాంచీ గోదావరిలో ప్రయాణిస్తున్న సమయంలో సుడిగాలులు వీయడంతో లాంచీ తలుపులు మూసివేశారని, దీంతో లాంచీ అక్కడిక్కడే మునిగిపోయింది.
సుమారు 5 మంది ప్రయాణికలు ఒడ్డుకు ఈదుకుని వచ్చినట్లు స్థానికుల సమాచారం. ప్రమాద వార్త తెలియగానే అధికారులు అక్కడికి చేరుకుని గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపులు మొదలుపెట్టారు. కొంతమంది గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపినట్టు చెబుతున్నారు. లాంచీని లక్ష్మీ వెంకటేశ్వర సర్వీస్ కంపెనీగా చెందినదిగా గుర్తించారు. ప్రస్తుతం దీని యజమాని రంపచోడవరం పోలీస్ స్టేషనులో ఉన్నట్టు సమాచారం.