కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి పూర్వవైభవం వచ్చింది. అధికారం రాకపోయినా.. మెజార్టీ స్థానాలతో బీజేపీ అధికారాన్ని చేపట్టే అవకాశాలను పదిలం చేసుకుంది. 2013లో కేవలం 40స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి అన్ని ప్రాంతాల్లోనూ పుంజుకుని ఏకంగా 104 స్థానాలను సాధించింది. ఈ విజయానికి గాలి, యెడ్డి, శ్రీరాములు కాంబినేషనే కారణమంటో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కర్ణాటకలో అధికారాన్ని చేపట్టేంత రేంజ్ లో స్థానాలు రాకున్నా.. బీజేపీకి ఈ ఎన్నికల్లో పూర్వవైభవం వచ్చింది. 2013 ఎన్నికల్లో కేవలం 40 సీట్లు మాత్రమే సాధించి పరాజయం పాలైన బీజేపీ ఈ ఎన్నికల్లో..కర్ణాటకలోని నలుదిశలా సత్తాచాటి 104 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఊహించని రీతిలో విజయాలను నమోదు చేయడానికి యడ్యూరప్ప, శ్రీరాములు, రెడ్డి వర్గమే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యడ్యూరప్ప రాష్ట్రంలోని బలీయమైన లింగాయత్ వర్గానికి చెందినవారు కాగా శ్రీరాములుకు వాల్మీకి వర్గంలో మంచి పట్టుంది. దీనికితోడు బళ్లారి రీజియన్ లో బలమైన ఆర్ధిక, అంగ బలమున్న రెడ్డి వర్గం మళ్లీ బీజేపీతో కలిసిరావడంతో బీజేపీ అనూహ్య విజయాలను సాధించిందని అంచనావేస్తున్నారు. ఈ ఎన్నికల్లో శ్రీరాములు సహా గాలి వర్గానికి మొత్తం 8 స్థానాలను కేటాయించడమే అందుకు నిదర్శనం..
2013 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యడ్యూరప్ప బీజేపీని వదిలి కర్ణాటక జనతా పక్షను నెలకొల్పారు. శ్రీరాములు కూడా బడవర శ్రామిక రైతు కాంగ్రెస్ను స్థాపించారు.2013 అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్ప సారథ్యంలోని కేజేపీ 9.8 శాతం ఓట్లను సాధించి ఆరు స్థానాల్లో గెలుపొందింది.అనేక స్థానాల్లో వీరు ఓట్లను చీల్చడంతో బీజేపీ కేవలం 40 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అదేవిధంగా బీఎస్ఆర్ కాంగ్రెస్ పలుస్థానాల్లో పోటీ చేయడంతో బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో వీరు తిరిగి బీజేపీ గూటికి చేరారు. ఇద్దరూ లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లోనూ యెడ్డి,రెడ్డి, శ్రీరాములు ప్రభావం కనిపించడంతో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది.
గాలి వర్గం బీజేపీతో కలిసిఉండడం కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుందని అంతా భావించారు. బీజేపీ అధిష్టానం కూడా గాలి జనార్ధన్ రెడ్డితో తమకు సంబంధం లేదని చెప్పింది. అయినా..బళ్లారిలో గాలి సోమశేఖర్ రెడ్డి, హరప్పనహళ్లిలో గాలి కరుణాకర్ రెడ్డిలు గెలవడమే కాదు.. బళ్లారీ రీజియన్ లో బీజేపీ అభ్యర్ధుల విజయంలో కీలక పాత్ర పోషించారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని వర్గాలు ఏకమౌవడంతో బీజేపీకి మెజార్టీ స్థానాలు దక్కాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే.. గాలి జనార్ధన్ రెడ్డి వర్గీయుల గెలుపు ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందనేది కొంతమంది ఆలోచన. వై.ఎస్.కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన గాలి జనార్ధన్ రెడ్డి కడపలో బ్రాహ్మణిస్టీల్ పరిశ్రమను స్థాపించాలనుకున్నారు. అయితే వై.ఎస్. మరణానంతరం అది అటకెక్కింది. ఆ తర్వాత గాలి కూడా ఏపీ వైపు కన్నెత్తి చూడలేదు. అక్కడ గాలిని కూడా పార్టీ నుంచి బయటకు పంపించడంతో కామ్ గా ఉండిపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ లైమ్ లైట్ లోకి రావడంతో ఏపీలో కూడా తన వంతు పాత్ర పోషిస్తారని అంచనా వేస్తున్నారు.