గోదావరిలో మంగళవారం సాయంత్రం లాంచీ మునక ఘటనలో బుధవారం సాయం త్రానికి 14 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇందులో రెండు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మంగళవారం నుంచి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు మునిగిన లాంచీని బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు లాంచీని బయటకు తీశారు. అయినవారి ఆచూకీ కోసం ఎడతెగని ఎదురుచూపులు. ఎదో అద్భుతం జరగదా అనే ఆశలు! . చెట్టుకొకరు, పుట్టకొకరై గాలింపులు! అంతలోనే ఆశలను అడయాశలు చేస్తూ ఆప్తుల మృతదేహాలు కంటిముందు ప్రత్యక్షమైతే గుండెలు పగిలేలా రోదనలు... అన్యాయం చేసిపోయారంటూ మిన్నంటిన వేదనలు.
ఇంకా ప్రాణాలతో ఉన్నారో, లేరో తెలియని తమ వారిని వెతికిపెట్టమంటూ అధికారుల చుట్టూ చేరి స్థానికులు చేస్తున్న వేడుకోళ్లతో లాంచీ ప్రమాదఘటనస్థలం వద్ద కన్నీటి గోదావరి కనిపిస్తోంది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై సీరియస్ అయ్యారు.
గతంలో ఇలాంటి సంఘటన జరిగినా మళ్లీ ఇలాంటి ఘటన ఎలా పునరావృతం అయ్యిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఆయన ప్రత్యక్షంగా బాధితులను పరామర్శించారు..వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
తాజాగా కెబినెట్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నదిలో లాంచీ ప్రమాద ఘటనపై సమావేశంలో ప్రస్తావించిన చంద్రబాబు.. ప్రమాదాలు జరిగిన తర్వాత ఎన్ని చర్యలు తీసుకుంటే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై వేసిన కమిటీ సంగతేంటని? ఆ కమిటీ ఇప్పటి వరకు ఎందుకు నివేదిక సమర్పించలేదని ప్రశ్నించారు. ఇకపై నదీ ప్రమాదాలు జరగకుండా విదేశాల్లో ఉన్నట్టు జల రవాణాకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.