రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనబడుతోంది. రానున్న ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఓట్లను ఆకర్షించటమే ప్రధాన లక్ష్యంగా బిజెపి పెద్ద వ్యూహమే సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే రాజధాని జిల్లా అయిన గుంటూరులో సీనియర్ నేత అయిన కన్నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.
ఎందుకంటే, కన్నా కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నేతే. పైగా అంతో ఇంతో కోస్తా జిల్లాల్లోని కాపు సామాజికవర్గంలో పట్టున్న నేత కూడా కావటం కలసివచ్చింది. అంటే, రానున్న ఎన్నికల్లో కాపు సామాజికవర్గంలోని నేతలను, వారిద్వారా ఓట్లను బిజెపికి పడేట్లు చేయటమే కన్నా ప్రధమ కర్తవ్యంగా అర్ధమవుతోంది.
కాపుల ఓట్లే కీలకం
రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు సామాజికవర్గం ఓట్లే చాలా కీలకం. ప్రధానంగా కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో కాపు సామాజిక వర్గం ఓట్లు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్దుల గెలుపోటముల్లో నిర్ణయాత్మక స్ధితిలో ఉన్నాయి. కాపు నేతల అంచనాల ప్రకారం మొత్తం 175 నియోజకవర్గాల్లో సుమారు 60 నియోజకవర్గల్లో కాపుల ఓట్లు చాలా కీలకం. ఇపుడు టిడిపి, కాంగ్రెస్, మొన్నటి వరకూ బిజెపి, వైసిపిలో ఏ పార్టీకి కూడా కాపు నేత అధ్యక్షునిగా లేరు. అందుకే ఏరి కోరి బిజెపి జాతీయ నాయకత్వం కాపు సామాజికవర్గం నేత అయినా కన్నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. దాంతో మొదటిసారి పెద్ద పార్టీకి కాపు నేత నేతృత్వం వహిస్తున్నట్లైంది. జనసేన అధ్యక్షునిగా పవన్ కల్యాణ్ ఉన్నప్పటికీ ఇంకా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు కాబట్టి సత్తా తెలీదు. కాకపోతే పవన్ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. అయితే, తనను కాపు సామాజికవర్గానికే పరిమితం చేయవద్దంటూ పవన్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్, టిడిపిలపైనే గురి ?
కాపు నేతలను ఆకర్షించటంలో కన్నా ప్రధానంగా కాంగ్రెస్, టిడిపిలపైనే గురి పెట్టినట్లు సమాచారం. 2014 వరకూ కన్నా కాంగ్రెస్ నేతే అన్న విషయం తెలిసిందే. కాబట్టి కాంగ్రెస్ నేతలతో ఇప్పటికీ కన్నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. అదే విధంగా టిడిపిలోని కాపు నేతలతో కూడా కన్నాకు గట్టి సంబంధాలే ఉన్నాయి. కాకపోతే టిడిపిలోని కాపు నేతల్లో పలువురు మొన్నటి వరకూ జనసేన వైపు చూస్తున్నారు. ఇపుడు బిజెపికి కన్నా అధ్యక్షుడు అవ్వటంతో బిజెపి గురించి కూడా ఆలోచించే స్ధితి వచ్చింది.ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంఎల్ఏలతో పాటు పలువురు నేతలకు టిక్కెట్ల విషయంలో చంద్రబాబు మొండి చెయ్యి చూపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అటువంటి నేతల్లో కాపులు కూడా ఉండొచ్చు.
జనసేనకు బిజెపి ప్రత్యామ్నాయమేనా ?
అందుకనే టిక్కెట్ల విషయంలో అనుమానం ఉన్న నేతలు పలువురు జనసేన వైపు చూస్తున్నారు. టిడిపిలోని 40 మంది ఎంఎల్ఏలు తనతో టచ్ లో ఉన్నట్లు పవన్ ఆమధ్య ప్రకటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. బహుశా వారిలో పలువురు జనసేన తరపున పోటీ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారేమో ? అటువంటి వారికి ఇపుడు బిజెపి కూడా ఇంకో ఆప్షన్ అయ్యింది. ఎటు తిరిగీ బిజెపిలో నేతల కొరత కావల్సినంతుంది. కాబట్టి బిజెపిలో చేరదలుచుకున్న వారికి టిక్కెట్లకు ఇబ్బంది లేకపోవచ్చు. ఇప్పటికప్పుడు రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేస్తుందని ఎవ్వరికీ ఆశలైతే లేవు. కాకపోతే కేంద్రంలో మళ్ళీ బిజెపినే అధికారంలోకి వస్తుందన్న ఆశమాత్రం చాలా మందిలో ఉంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో ఏదో ఓ పద్దతిలో నెట్టుకొచ్చేయన్న ఆశతోనే పలువురు నేతలు బిజెపిలో చేరే అవకాశాలున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.