తిరుమలలో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయంటూ ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అదే సమయంలో వయసు మీరిపోయిందంటూ రమణ దీక్షితులను తొలగించడం మరో సంచలనానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా రమణ దీక్షితులపై ఘాటుగానే స్పందించింది.
తిరుమలలో అభివృద్ధి పేరుతో ఆగమ శాస్త్ర నియమాలను ఉల్లంఘించి కార్యకలపాలు సాగిస్తున్నారని ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించడం తీవ్ర ఆందోళన కలిగించింది. అంతేకాక.. శ్రీవారికి సమర్పిస్తున్న కానుకలు, ఆభరణాలకు సంబంధించిన లెక్కలపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. వీటన్నిటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాలపై ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
రమణ దీక్షితులు తీవ్ర వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే భేటీ అయిన కొత్త పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన అర్చకులను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో 70 ఏళ్లున్న రమణ దీక్షితులకు కూడా ఉద్వాసన పలికినట్లయింది. దీనిపై కూడా రమణ దీక్షితులు స్పందించారు. తనను విధుల నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తానన్నారు.
అయితే రమణ దీక్షితులు ఆరోపణలపైన, ఆయన వ్యవహార శైలిపైనా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆయన బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదన్నారు. ఆయన అర్చక వృత్తిని వదిలేసి రాజకీయ దీక్ష తీసుకున్నట్లున్నారని కేఈ విమర్శించారు. ప్రధాన అర్చకుడిగా ఆయన సంప్రదాయాలకు విరుద్ధంగా ఎన్నో తప్పులు చేశారన్నారు. కొంతమందిని అర్ధరాత్రిపూట తీసుకెళ్లి పూజలు చేయించారన్నారు. పక్కరాష్ట్రంలో కూర్చుని ఏడుకొండలవాడిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గతంలో ఇలా మాట్లాడిన వారందరికీ ఏం జరిగిందో అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. రమణ దీక్షితులు చేసిన తప్పులపై విచారణ జరుపుతామని, స్వామివారి నగలుపై ఏటా వెరిఫికేషన్ ఉంటుందని కేఈ వెల్లడించారు. రమణదీక్షితులు పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని కేఈ విమర్శించారు. గతంలో స్వామివారి నగలు భద్రమని రమణ దీక్షితులే చెప్పారన్నారు.
ఇటీవల తిరుమలకు వచ్చిన అమిత్ షాకు ప్రత్యేక దర్శనాలను తామే ఏర్పాటు చేయించామన్నారు కేఈ కృష్ణమూర్తి. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం ఎప్పుడూ వెనకాడదన్న ఆయన.. ఏడుకొండలవాడితో ఎవరూ పెట్టుకోవద్దని హితవు పలికారు.