కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరైన సంఖ్యా బలం లేకపోయినా యడ్యూరప్పని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించడంతో కాంగ్రెస్ – జేడీఎస్ లు సుప్రీమ్ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును బుధవారం నాడు ఆశ్రయించింది. అయితే ఈ విషయమై అర్ధరాత్రి పూట సుప్రీంకోర్టు రెండు వర్గాల వాదనలను విన్నది. అయితే ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం చేయకుండా ఉండేందుకు స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
దీంతో గురువారం నాడు ఉదయం పూట యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలపై యావత్ దేశం ఇప్పుడు సీరియస్ అవుతుంది. బలనిరూపణ లేకున్నా కేంద్రం జోక్యంతో అక్కడ తక్కువ మెజార్టీ వచ్చిన యడ్యూరప్పకు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడంచడంపై సర్వత్రా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ విషయంలో..సొంత పార్టీ వాళ్లే ఛీ కొడుతున్నారు. అసహ్యించుకుంటున్నారు. బీజేపీ పెద్దలు కర్నాటక పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు.
షా, మోడీ చౌకబారు, అప్రజాస్వామిక రాజకీయాలను వారు దుమ్మెత్తి పోస్తున్నారు. బీజేపీని నాశనం చేయటానికే వీరిద్దరూ దాపురించారని ఆవేదన చెందుతున్నారు. బీజేపీకి మెజారిటీ లేకపోయినప్పటికీ… యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో… సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ఇంప్లీడ్కు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్పై విచారణ కొనసాగుతుందని, యడ్యూరప్ప ప్రమాణస్వీకార అంశం తుది తీర్పుకు లోబడి ఉంటుందని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, శుక్రవారం ఈ విషయాన్ని సరైన బెంచ్ ముందు ప్రతిపాదించాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆయనకు సూచించింది. వ్యక్తిగత హోదాలో గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ… రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.