కర్నాటకలో ప్రస్తుత రాజకీయ పరిస్ధితులపై జెడిఎస్ అధినేత కుమారస్వామి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్ చేశారట. మద్దతివ్వాలంటూ కోరారట. అంటే ఒక్క చంద్రబాబును మాత్రమే కాదు లేండి. కెసిఆర్ తో పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఒడిస్సా సిఎం నవీన్ పట్నాయక్, ఉత్తర ప్రదేశ్ లో మాయావతి తదితరులకు ఫోన్ చేసి మద్దతు కోరారు.
అప్రజాస్వామికంగా బిజెపి అధికారంలోకి వచ్చిందంటూ కుమారస్వామి చంద్రబాబుతో ఫోన్లో మండిపడినట్లు సమాచారం. తమ ఎంఎల్ఏలను కొనుగోలు చేయటానికి బిజెపి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారట. విషయమంతా విన్న తర్వాత బిజెపి వ్యతిరేక ఉద్యమానికి కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు ముక్తసరిగా చెప్పి ఫోన్ చెప్పి ఫోన్ పెట్టేశారట.
కర్నాటక రాజకీయాలపై చంద్రబాబు బ్రీఫింగ్
కుమారస్వామితో మాట్లాడిన తర్వాత సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించారు. అన్నీ విషయాలను వివరించారట. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కర్నాటక రాజకీయాల్లో లోతుగా జోక్యం చేసుకోకపోవటమే మంచిదని సీనియర్లు చంద్రబాబుకు సూచించారట. ఎందుకంటే,కర్నాటకలో ప్రస్తుతం కాంగ్రెస్, జెడిఎస్ ఎంఎల్ఏల కొనుగోలు అంశమే ప్రధానంగా ఉంది. తమ ఎంఎల్ఏలను బిజెపి భారీగా కొనుగోలు చేస్తోందంటూ కుమారస్వామి ఆరోపణలు చేస్తున్నారు. ఆ నేపధ్యంలో ఇపుడు గనుక జెడిఎస్ కు చంద్రబాబు మద్దతిస్తే పోయేది టిడిపి పరువే. ఎందుకంటే, అదే పనిని చంద్రబాబు ఏపిలో కూడా యధేచ్చగా చేస్తున్నారు.
వేలుపెడితే ఇంకేమన్నా ఉందా ?
కర్నాటక రాజకీయాల్లో గనుక చంద్రబాబు జోక్యం చేసుకుంటే ఏపిలో బూమ్ రాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువ అని సీనియర్లు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, కర్నాటకలో బిజెపి తమ విషయంలో ఏమి చేస్తోందని ఆరోపిస్తున్నారో అదే విధానాన్ని ఏపిలో వైసిపి విషయంలో చంద్రబాబు ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి ఏ పద్దతిలో కూడా కర్నాటక రాజకీయాల్లో చంద్రబాబు జోక్యం చేసుకోకపోవటమే మంచిదని సమావేశంలో నిర్ణయమైంది.