ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో ఇలాంటి ఘటనలు జరుగడంపై పార్టీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. వైరా నియోజకవర్గంలో దాదాపుగా రెండేళ్ల నుంచి ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే మదన్లాల్ మధ్య వారి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీ పొంగులేటి, వైరా ఎమ్మెల్యేగా మదన్లాల్ గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే మదన్లాల్ అదే ఏడాది అధికార టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత ఎంపీ పొంగులేటి 2016లో గూటికి చేరారు.
ఈ క్రమంలో వీరిద్దరి మధ్య విభేదాల తారా స్థాయికి చేరాయి. టీఆర్ఎస్లో చేరిన తర్వాత పరిస్థితి మరింతగా ముదిరింది. పార్టీ అధిష్టానం, జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో వీరిమధ్య సయోధ్య కుదిరినట్లే కనిపించినా అది ఉట్టిమాటేనని తేలిపోయింది. అంతేగాకుండా కొద్దిరోజుల కిందట ఓ తండాకు వెళ్లిన మదన్లాల్ ముందు ఆయన దిష్టిబొమ్మకు చెప్పులు వేసి, ఊరేగించిన విషయం తెలిసిందే.
ఇంతకీ ఏం జరుగుతుందంటే... ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ వైరా నియోజకవర్గంలో పోటాపోటీగా పర్యటిస్తున్నారు. ఈ తరుణంలోనే పెద్దమునగాలలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్లాల్ మొదట వచ్చారు. ఆ తర్వాత ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వచ్చారు. కొందరు మహిళలు ఎంపీకి నాగలిని బహూకరిస్తున్న సమయంలో ఎంపీ వర్గం నుంచి కోసూరి శ్రీను వేదిక వద్దకు వచ్చి వచ్చి మైకు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన పాముల వెంకటేశ్వర్లు అతన్ని ఆవేదనతో దూషించాడు. అదికాస్తా ఇరువర్గాలు తన్నుకునే దాకా వెళ్లి. చివరకు పొలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇందులో కొసమెరుపు ఏమిటంటే.. గొడవకు ముందు కొందరు ఎంపీ ఫొటో ఎందుకు పెట్టలేదని తహసీల్దార్ శైలజను ప్రశ్నించగా.. ఆమె స్వయంగా ఎంపీ వద్దకు వెళ్లి.. ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన ఫ్లెక్సీ అని చెప్పడం గమనార్హం.