టీడీపీ అధినేత చంద్రబాబు.. `పడవ` ప్రయాణం చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు! అదేంటి? అని ఆశ్చర్య పోవ డం సహజం. ప్రస్తుతం ఆయన పరిస్థితి రాజకీయ పడవ ప్రయాణం చేస్తున్నారని చెబుతున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న సమయంలో ఆయనకు అగ్ని పరీక్ష తప్పదని అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి జరుగుతోందని చెబుతున్నారు చంద్రబాబు. అయితే, మరోపక్క మాత్రం ఉపాధి కనిపించడం లేదని, తమకు ఎక్కడా ఉద్యోగాలు దక్కడం లేదని అంటున్నారు నిరుద్యోగులు.
ఇక, రైతులను ఆదుకోవాల్సిన అవసరం వచ్చింది. వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు పొంచి ఉన్నాయి. మరోపక్క నీటి సమస్యలు నోరుచాస్తున్నాయి. ఇవిలా ఉంటే.. చంద్రబాబు ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైన.. హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి! ఈ రెండు ప్రధాన కీలక హామీలు. అయితే, ప్రభుత్వ ఖజానా పరిస్థితి మాత్రం కొల్లబోతోం ది. తాజాగా కేంద్రం నుంచి అందాల్సిన నిధులు రాకపోతే.. వచ్చే నెలలో ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు వేసే ప్రతి అడుగూ.. పడవ ప్రయాణాన్ని తలపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. రాజకీయాలు చేయడానికి ఇప్పుడు టైం లేదు. పొంచి ఉన్న విమర్శల బాణాలు బాబును చుట్టు ముట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఒకపక్క ఇప్పటికే వైసీపీ అధినేత ఇటు నుంచి(సీమ) నరుక్కుని వెళ్తున్నారు. బాబుకు వ్యతిరేకంగా ఆయన జనసమీకరణ చేస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లో పార్టీని సుస్థిరం చేసుకుం టున్నారు. నాటి కాంగ్రెస్ పార్టీని మరిపించేలా ఆయన గ్రామ గ్రామానా తిరుగుతూ.. ప్రజలను సమీకరిస్తున్నారు. ఇది ఒకరకంగా టీడీపీకి పెను సవాలుగా మారింది.
ఇక, ఇప్పుడు తాజాగా తూర్పు నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్.. రంగంలోకి దిగుతున్నాడు. ఆయన తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఉద్యమాలకు రెడీ అవుతున్నాడు. దీంతో టీడీపీకి అటు జగన్, ఇటు పవన్లు ప్రధానంగా వేడి పుట్టించనున్నారు. ఇక, తాజాగా బీజేపీ కూడా బాబుపై కత్తికట్టినట్టు వ్యవహరిస్తోంది. బాబును ఏకాకిని చేసేందుకు చేసిన ప్రయత్నాల్లోభాగంగా కన్నా లక్ష్మీనారాయణను రంగంలోకి దింపింది. ఈయన కూడా త్వరలోనే యాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ పరిణామాలు చంద్రబాబు..కు ఎన్నికల సముద్రంలో పడవ ప్రయాణంగా అనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి బాబు ప్రయాణం తీరం చేరుతుందో.. మధ్యలోనే గల్లంతవతుందో చూడాలి.