సుప్రీంకోర్టులో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రేపే బలపరీక్షకు ఆదేశించింది. గవర్నర్ వజుభాయి వాలా యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించిన తర్వాత ఆయన వెంటనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇది అనైతికమంటూ కాంగ్రెస్-జేడీఎస్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వీరి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది.
కర్నాటకలో యడ్యారప్ప రేపే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. గవర్నర్ ఆయనకు 15 రోజుల్లోపు బలపరీక్ష నిరూపించుకోవాలని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం తగినంత బలం లేనప్పుడు ఎలా ప్రభుత్వాన్ని నడుపుతారని ప్రశ్నించింది. సంఖ్యాబలం లేనప్పుడు గవర్నర్ ఎలా ప్రభుత్వ ఏర్పాటుకు పిలుపునిస్తారని అడిగింది. మరోవైపు.. తాము బలం నిరూపించుకునేందుకు ఈ క్షణమైనా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్-జేడీఎస్ లు సుప్రీంకోర్టుకు విన్నవించాయి. దీంతో రేపు సాయంత్రం 4 గంటలకు కర్నాటక అసెంబ్లీలో బల పరీక్ష జరగనుంది.
బలపరీక్షకు మరికొంత సమయం ఇవ్వాలని యడ్యూరప్ప తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీకోర్టును అభ్యర్థించారు. అయితే ఆయన వినతిని సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. కాంగ్రెస్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ మాత్రం తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అయితే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన వేణుగోపాల్.. సీక్రెట్ పద్దతి ద్వారా ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని కోరారు. దానికి కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకాక.. ఎలాంటి కీలక నిర్ణయాలు యడ్యూరప్ప తీసుకోవద్దని ఆదేశించింది.
రేపటి బలపరీక్ష కంటే ముందు స్పీకర్ ఎన్నిక కీలకం కానుంది. ప్రొటెం స్పీకర్ ద్వారా బలపరీక్ష నిర్వహణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫ్లోర్ టెస్ట్ ఏ ఫార్మాట్ లో జరగాలనేది ప్రొటెం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం తేల్చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. తప్పకుండా తాము విజయం సాధిస్తామనే నమ్మకం వ్యక్తం చేసింది. అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రకటించాయి. ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే కాంగ్రెస్ – జేడీఎస్ లు విజయం సాధించడం ఖాయం. ఒకవేళ ఎమ్మెల్యేలను నిలుపుకోలేకపోతే.. ఆ పార్టీల కూటమి అందివచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టవుతుంది.