కన్నడ రాజకీయ నాటకం రోజుకో మలుపు తీసుకున్ టుంది. కాంగ్రెస్-జేడీఎస్ కు కలిపి సాధారణ ఆధిక్యత కంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ గవర్నర్ మాత్రం అత్యధిక సీట్లు గెలుపొందిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.
అయితే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్ సుప్రీం మెట్లుఎక్కాయి. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి ముందు, గవర్నర్ విచక్షణాధికారాన్ని ప్రశ్నించ లేమని చెప్పిన అత్యున్నత ధర్మాసనం, తాజాగా శుక్రవారం ఉదయం ఆ పార్టీల పిటీషన్ ను పరిశీలించింది. శనివారం సాయంత్రం 4గంటలకు శాసనసభలో బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఆదేశించింది. బలపరీక్షకు గవర్నర్ 15రోజులు గడువు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీం తీర్పు ఆసక్తి రేపుతోంది.
ఇది కేవలం నంబర్ గేమ్ మాత్రమేనని, మెజార్టీ ఉన్న పక్షాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు తప్పకుండా ఆహ్వానించాలని తెలిపింది. కాగా, బల నిరూపణకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని బీజేపీ లాయర్ ముకుల్ రోహత్గి కోరినప్పటికీ, సుప్రీం కోర్ట్ తోసిపుచ్చింది. ముందుగా బలం నిరూపించుకునే అవకాశం బీజేపీ, జేడీఎస్-కాంగ్రెస్ లలో ఎవరికి ఇవ్వాలో సుప్రీం కోర్ట్ నిర్ణయించాలని కాంగ్రెస్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీం కోటు ధర్మ పీఠాన్ని కోరారు. ఎమ్మెల్యేలు ఎలాంటి భయం లేకుండా ఓటు వేసేలా వారికి రక్షణ కల్పించాలని, బల నిరూపణ ప్రక్రియను వీడియో తీయాలని ఆయన కోరారు.
కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ కేసులో వాదనలు వినిపిస్తుండగా, కాంగ్రెస్, జేడీఎస్ తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత వారి న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు. కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్ సిబల్ కూడా వాదనల సమయంలో న్యాయ స్థానం లోనే ఉన్నారు. కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప ప్రభుత్వం బలపరీక్షకు సమయం కావాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అటార్నీ జనరల్ మాట్లాడుతూ బల పరీక్షను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని సుప్రీం కోర్టును కోరారు. అయితే ఈ ప్రతిపాదనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో కర్ణాటక ముఖ్య మంత్రి యడ్యూరప్పకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
శాసనసభలో బలపరీక్ష జరిగే వరకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని యడ్యూరప్పను ఆదేశించింది. వెంటనే తాత్కాలిక స్పీకర్ను నియమించాలని, ఎటువంటి పదవుల్లోనూ నాయకులను నియమించవద్దని స్పష్టం చేసింది. బలపరీక్ష లో గెలిచిన తర్వాత మాత్రమే యడ్యూరప్ప విధానపరమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. శనివారం మధ్యాహ్నం 4గంటలకు కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప ప్రభుత్వంపై విశ్వాసపరీక్ష జరుగుతుంది.
శనివారం సాయంత్రం 4గంటలకు అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కర్నాటక సీఎం ఎడ్యూరప్ప స్పందించారు తన ప్రభుత్వం ఖచ్చితంగా విశ్వాసపరీక్షలో నెగ్గుతుందన్నారు. బలపరీక్షకు తాము సిద్ధమని, తన సర్కార్ ను బలపరిచేందుకు తగినంతమంది ఎమ్మెల్యే ల బలం తమకు ఉందని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామన్నారు.