కర్నాటక రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ ను మించిపోతోంది. రోజుకో మలుపు కాదు. క్షణానికో మలుపన్నట్లు రాజకీయం సాగుతోంది. 23వ ముఖ్యమంత్రిగా బిజెపి నేత బిఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు కాకుండానే సుప్రింకోర్టు షాక్ ఇచ్చింది. శనివారం సాయంత్రానికల్లా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలంటూ ఆదేశించింది. యడ్యూరప్ప ప్రమాణిస్వీకారం చేయటంపై కాంగ్రెస్, జెడిఎస్ లు సుప్రింకోర్టును ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసిందే.
ప్రమాణస్వీకారంలో జోక్యం చేసుకోమని చెప్పిన సుప్రిం శుక్రవారం ఉదయం విచారణ సందర్భంగా బిజెపితో పాటు యడ్యూరప్పకు వరుసబెట్టి షాకులిస్తూనే ఉంది. శనివారం సాయంత్రం 4 గంటలకల్లా యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. బలనిరూపణకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. దాంతో బిజెపి శిబిరంలో టెన్షన్ మొదలైంది.
హైదరాబాద్ లో క్యాంపు
15 రోజుల్లో తమ ఎంఎల్ఏలను కాపాడుకోవటానికి వీలుగా కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు తమ ఎంఎల్ఏలతో హైదరాబాద్ లో క్యాంపు వేశాయి. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సుమారు 100 మంది ఎంఎల్ఏలతో రెండు పార్టీల నేతలు హైదరాబాద్ చేరుకున్నారు. క్యాంపును తెలంగాణా పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఎంఎల్ఏలు అలా హైదరాబాద్ కు చేరుకున్నారో లేదో వెంటనే మళ్ళీ బెంగుళూరుకు బయలు దేరాల్సి వచ్చింది. ఎందుకంటే, సుప్రింకోర్టులో విచారణ మొదలుకాగానే శనివారం సాయంత్రానికల్లా యడ్డీ బలనిరూపణ చేసుకోవాలని సుప్రిం ఆదేశాలే కారణం. దాంతో బెంగుళూరునుండి వచ్చిన ఎంఎల్ఏలందరూ మళ్ళీ శుక్రవారం సాయంత్రానికల్లా బయలుదేరాల్సిన అవసరం వచ్చింది.
బిజెపి వాదనను పట్టించుకోని సుప్రిం
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటంలో కానీ బల నిరూపణలో కానీ బిజెపి వాదనన కోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు కనబడలేదు. బలనిరూపణకు తమకు గవర్నర్ 15 రోజుల గడువిచ్చిన సంగతి బిజెపి తరపు లాయర్ చెప్పినా కోర్టు వినలేదు. పైగా తమ ఆదేశాల ప్రకారం నడుచుకోకపోతే అసలు యడ్డీ ప్రమాణస్వీకారంపైనే సమీక్షించాల్సుంటుందన్న హెచ్చరికలతో బిజెపి వెనక్కు తగ్గింది. దాంతో గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువు కాకున్నా కొద్ది రోజుల గడవు కావాలంటూ బిజెపి అడిగింది. అయినా కోర్టు అంగీకరించలేదు. దాంతో ఏ నిముషంలో ఏం జరుగుతుందో అర్ధంకాక రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది.
మారిపోతున్న బలాలు
కర్నాటకలో పార్టీల బలాలు నిముషానికో తీరుగా మారిపోతోంది. బిజెపి తరపున గెలిచింది 104 మంది ఎంఎల్ఏలు మాత్రమే. అయితే, గురువారం స్వతంత్ర అభ్యర్ధి శంకర్ బిజెపికి మద్దతు పలికారు. దాంతో బిజెపి బలం 105కి పెరిగింది. అయితే, శుక్రవారం హైదరాబాద్ కు క్యాంపుకొచ్చిన కాంగ్రెస్, జెడిఎస్ ఎంఎల్ఏలతో శంకర్ కనిపించటంతొ బిజెపి నేతలు బిత్తరపోయారు. దానికితోడు తాను కాంగ్రెస్ కే మద్దతిస్తున్నట్లు శంకర్ చేసిన ప్రకటనతో బిజెపి లో టెన్షన్ మొదలైంది. అదే సమయంలో తమకు 120 మంది ఎంఎల్ఏల మద్దతున్నట్లు బిజెపి సుప్రింకోర్టుకు చెప్పటంతో కాంగ్రెస్, జెడిఎస్ లో టెన్షన్ పెరిగిపోతోంది. ఏ నిముషంలో ఏం జరుగుతుందో అర్ధంకాక కర్నాటక రాజకీయాలు సస్పన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది.