ప్రస్తుతం దేశం మొత్తం కర్నాటకవైపే చూస్తోంది. రేపు బలపరీక్ష నేపథ్యంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గేందుకు శతవిధాలా ట్రై చేస్తున్నారు. అదే సమయంలో సంఖ్యాబలం లేకపోయినా అప్రజాస్వామికంగా గద్దెనెక్కిన యెడ్డీని ఎలాగైనా కుర్చీ దింపాలని ప్రతిపక్ష కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రయత్నిస్తోంది. అయితే గవర్నర్ వజూభాయి వాలా మాత్రం యెడ్యూరప్పను సేవ్ చేసేందుకు అన్నివిధాలా ట్రై చేస్తున్నారు.
కర్నాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశించారు గవర్నర్ వజుభాయి వాలా. దాన్ని ఎవరూ తప్పుబట్టలేరు. ఎందుకంటే గతంలో ఈ సంప్రదాయం ఉండేది. అయితే ఆహ్వానించిన బీజేపీ కంటే తమ కూటమికి ఎక్కువ బలం ఉందని కాంగ్రెస్-జేడీఎస్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా బీజేపీని ఆహ్వానించడమే ఆశ్చర్యం కలిగించింది. అంటే కూటమిలోని సభ్యులను చీల్చితే తప్ప యెడ్యూరప్ప సర్కార్ గెలిచే పరిస్థితి లేదు. కూటమిలోని సభ్యులను చీల్చి పాలన సాగించమని గవర్నరే స్వయంగా చెప్పినట్లుందిది. ఇదేం వ్యవస్థ..? యడ్యూరప్పకు బలం లేదని కళ్లముందు కనబడుతున్నా.. ఇతరులు మద్దతిచ్చినా తగిన మెజారిటీ లేదని తేటతెల్లమవుతున్నా బీజేపీకి పగ్గాలివ్వడం కచ్చితంగా అప్రజాస్వామికమే.!
కాంగ్రెస్-జేడీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అక్కడ వారికి అనుకూలంగా తీర్పు లభించడంతో బీజేపీ కంగుతింది. అక్కడ కూడా సంప్రదాయాలకు విరుద్ధంగా సీక్రెట్ ఓటింగ్ కు ఆదేశించాలని బీజేపీ కోరడం సిగ్గుచేటు. ఓపెన్ కౌంటింగ్ ద్వారా అయితే ఓడిపోతామనే భయపడే సీక్రెట్ ఓటింగ్ కు పట్టుబట్టింది. దీన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించడం న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచింది. సంఖ్యాబలం లేకపోయినా గవర్నర్ ఆహ్వానించడం, యడ్యూరప్ప పాలనాపగ్గాలు చేపట్టి కీలక నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ప్రజాస్వామ్యానికి చెంపపెట్టే. ఇలాంటివాటిని ప్రోత్సహించడం ప్రజాస్వామ్య వ్యవస్థ పతనానికి దారితీస్తుంది.
సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరిగిందన్న ఆశ కాసేపట్లోనే ఆవిరైంది కాంగ్రెస్-జేడీస్ కూటమికి.! సభలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెమ్ స్పీకర్ గా నియమించే సంప్రదాయానికి తూట్లు పొడిచిన గవర్నర్.. బీజేపీకే చెందిన, 3 సార్లు గెలిచిన బోపయ్యను ప్రోటెం స్పీకర్ గా ఆగమేఘాల మీద నియమించడం, ప్రమాణ స్వీకారం చేయించడం మరింత దారుణం. బలం లేకపోయినా యడ్యూరప్పకు అవకాశం ఇవ్వడం, సీనియర్ ఎమ్మెల్యేను కాదని తక్కువ అర్హత ఉన్న వ్యక్తిని ప్రోటెం స్పీకర్ గా నియమించడం.. గవర్నర్ చేసిన తప్పులు.! ప్రోటెం స్పీకర్ నియామకంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. బలపరీక్ష సమయంలో ప్రోటెం స్పీకర్ దే కీలకపాత్ర. ఇలాంటి సమయంలో సీనియర్ ను కాదని వేరేవాళ్లకు అవకాశం ఇవ్వడం కచ్చితంగా కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి అశనిపాతమే. కర్నాటక మొత్తం వ్యవహారంలో గవర్నర్ ఏమాత్రం సంకోచించకుండా పక్షపాతంతో వ్యవహరిస్తుండడం ఎవరూ కాదనలేని సత్యం.