కర్నాటక అసెంబ్లీ ప్రోటెమ్ స్పీకర్ నియామకంలో పెద్ద వివాదమే రేగుతోంది. సభలో అత్యంత సీనియర్ సభ్యుడిని కాదని సిఎం యడ్యూరప్ప తనకిష్టమైన బోపయ్యను ప్రోటెమ్ స్పీకర్ గా నియమించటంపై కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు మండిపడుతున్నాయి. ప్రోటెమ్ స్పీకర్ నియామకంపై కూడా సుప్రింకోర్టుకు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ.
అదే సమయంలో గవర్నర్ వైఖరిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. మొత్తం మీద ఎంత రచ్చ జరగాలో అంత రచ్చా జరుగుతోంది. బలం నిరూపించుకునే విషయంలో బిజెపి అన్నీ విలువలకు వలువలు ఊడదీసేసింది. దాంతో అందుబాటులో ఉన్న అన్నీ అడ్డదారులను తొక్కేందుకు సిద్ధపడిపోయింది.
ఇంతకీ ప్రోటెమ్ స్పీకర్ నియామకం కరెక్టేనా ?
ఉదయం నుండి వివాదానికి మూల కారణమైన ప్రోటెమ్ స్పీకర్ నియామకం కరెక్టేనా ? ప్రోటెమ్ స్పీకర్ నియామకంలో గవర్నర్ నియమ, నిబంధనలను పాటించారా అన్న విషయమై తెలుగు రాష్ట్రాల ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఇదే విషయాన్ని అసెంబ్లీలోని కొందరు సీనియర్ అధికారులతో మాట్లాడితే ఓ ఆసక్తికరమైన విషయాన్ని వివరించారు. వారి చెప్పిన వివరాల ప్రకారం ప్రోటెమ్ స్పీకర్ నియామకానికి సంబంధించి గవర్నర్ వైఖరిలో తప్పేమీ లేదని తెలిసింది.
గవర్నర్ నిబంధన పాటించారా ?
గవర్నర్ ఆదేశాల ప్రకారం గెలిచిన ఎంఎల్ఏల్లో అత్యంత సీనియర్లతో కూడిన కొంతమంది ఎంఎల్ఏల జాబితాను ముఖ్యమంత్రికి అందచేస్తుంది అసెంబ్లీ సెక్రటేరియట్. అందులో నుండి తనకు అనుకూలమైన ఎంఎల్ఏల పేరును సిఎం గవర్నర్ కు సిఫారసు చేస్తారు. గవర్నర్ సిఎం సూచించిన పేరునే ప్రోటెమ్ స్పీకర్ గా ఖరారు చేస్తారు. అంతే కానీ సభలో అత్యంత సీనియర్ అయిన సభ్యుడినే ప్రోటెమ్ స్పీకర్ గా నియమించాలన్న నిబంధనేదీ లేదని అసెంబ్లీ అధికారులు చెప్పారు. అంటే అసెంబ్లీ అధికారులు చెప్పిన ప్రకారం ప్రోటెమ్ స్పీకర్ నియామకంలో గవర్నర్ నిబంధనలను ఉల్లంఘింలేదని స్పష్టమవుతోంది.