ఎన్నికల ముంగిట ఏపీలో టికెట్ కొట్లాటలు పెరిగిపోతున్నాయి. ఒక రాధ ఇద్దరు కృష్ణులు పోయి.. ఒక సీటు నలుగురు తమ్ముళ్లు అన్న చందంగా మారిపోయింది పరిస్థితి. కొన్ని కీలక నియోజకవర్గాల్లో అంతే కీలకంగా ఉన్న నాయకులు పోటీ పడుతున్నారు. ఉదాహరణకు విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గాన్ని తీసుకుంటే.. ఇక్కడ అధికార పార్టీలో నేతలు టీకెట్ కోసం తన్నుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి తోడు ముగ్గురు కీలక నాయకులు ఇక్కడ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో టీడీపీలో టికెట్ల హోరు పెరిగింది. అనకాపల్లి నియోకవర్గం నుంచి 2014లో టీడీపీ నాయకుడు పీలా గోవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈయన తనకే ఈ సీటు కేటాయించాలని అధిష్టానం దగ్గర విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదిలావుంటే, ప్రస్తుతం ఇదే జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అనకాపల్లిపై దృష్టి పెట్టారు. తన నియోజకవర్గంలో తనకు ఇప్పుడు ఎదురు గాలి వీస్తోందని పెద్ద ఎత్తున ఆయన సమాచారం అందింది. ఒకపక్క తన కుటుంబ సభ్యుల హవా ఎక్కువైపోవడంతో ఇక్కడి ప్రజలు గంటాను వదిలించుకునేందుకు యత్నిస్తున్నారు. దీంతో ఆయన తన నియోజకవర్గాన్ని మార్చమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు చెవిలో వేశారట. అంతేకాదు, గతంలో తాను టీడీపీలో ఉండగా చంద్రబాబు' కోరికపై అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేశాను..ఇప్పుడు తనకా సీటు కావాలని కోరుతున్నారు. అదేసమయంలో తనకు అనకాపల్లిని కేటాయించాలని కూడా ఆయన కోరినట్టు తెలుస్తోంది.
ఇక, మూడో వ్యక్తి ప్రస్తుత అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్. ఈయనకు కూడా ఎంపీ నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తోంది. ఎన్నికల హామీల్లో కీలకమైన విశాఖ రైల్వే జోన్ కల ఇప్పట్లో సాకారమయ్యే పరిస్థితి లేదు. దీంతో ఈయన పోటీ చేసినా.. ఓటమి తప్ప సాదించేది లేదు. దీంతో తనను అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితం చేయాలని కోరుతున్నారట. ఇదే విషయాన్ని ఈయన కూడా కళా వెంకట్రావు చెవిలో వేయడంతోపాటు అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్కు కూడా ఇటీవల విన్నవించుకున్నట్టు సమాచారం. తొలుత భీమిలి నుంచి పోటీ చేయాలని అనుకున్నా.. అక్కడ అసలు టీడీపీ పరిస్థితే బాగోలేదని, ఎవరు నిలబడ్డా ఓడడం ఖాయమని తెలియడంతో అవంతి యూటర్న్ తీసుకుని అనకాపల్లి కోరుతున్నారట.
ఇదిలావుంటే, టీడీపీని ధిక్కరించి వైసీపీలో చేరి.. మళ్లీ అక్కడా కుదరక బయటకు వచ్చి ప్రస్తుతం ఖాళీగా ఉన్న మాజీమంత్రి దాడి వీరభద్రరావు కూడా అనకాపల్లి నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తే..తాను టీడీపీలో చేరతానని మధ్యవర్తుల ద్వారా చంద్రబాబుకు తెలిపారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఒక్క సీటు నలుగురు నాయకులు అన్న చందంగా అనకాపల్లి మారిపోయిందని అంటున్నారు టీడీపీ నేతలు. దీనిపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.