యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి మూణ్ణాళ్ళ ముచ్చటగా మిగిలిపోవటంతో తదుపరి సిఎంగా జెడిఎస్ నేత కుమారస్వామే అంటూ ప్రచారం ఊపందకుంది. కర్నాటకకు 23వ ముఖ్యమంత్రిగా మూడు రోజుల క్రితం ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప బలనిరూపణలో శనివారం విఫలమయ్యారు. ఈరోజు అసెంబ్లీలో జరిగిన సమావేశంలో అవసరమైన 112 మంది ఎంఎల్ఏల బలాన్ని కూడగట్టలేక వైఫల్యాన్ని అంగీకరిస్తూ యడ్యూరప్ప రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పుడైతే యడ్యూరప్ప ఓటమి ఖాయమని తేలిపోయిందో వెంటనే కాంగ్రెస్, జెడిఎస్ శిబిరంలో ఒక్కసారిగా సంబరాలు మొదలయ్యాయి.
తదుపరి ముఖ్యమంత్రిగా జెడిఎస్ అధినేత కుమారస్వామే అంటూ ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే, బిజెపిని అధికారంలోకి రానీయకూడదన్న ఏకైక లక్ష్యంతో 78 స్ధానాలున్న కాంగ్రెస్ పార్టీ 38 స్ధానాలున్న జెడిఎస్ కు మద్దతు ప్రకటించింది. దాంతో జెడిఎస్ అధినేత కుమారస్వామిలో ఉత్సాహం పొంగిపొరలుతోంది.
అయితే, గవర్నర్ బలనిరూపణకు బిజెపికి అవకాశం ఇవ్వటంతో కాంగ్రెస్, జెడిఎస్ కూటమిలో నిరాశ తొంగిచూసింది. అయితే, యడ్యూరప్ప ఓటమిని అంగీకరిచటంతో బంతి తాజాగా కాంగ్రెస్, జెడిఎస్ కూటమి కోర్టులో పడింది. అంటే కుమారస్వామికి ముఖ్యమంత్రిగా అవకాశాలు మెరుగయ్యాయి. దాంతో కర్నాటక తదుపరి సిఎంగా కుమారస్వామి అవసరమైన కసరత్తు మొదలు పెట్టి గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు.