బలంలేకున్నా అధికారం కోసం అడ్డదారులను వెతుక్కున్న కమలదళానికి ఆఖరికి ఘోర పరాభవం తప్పలేదు. అడుగడుగునా రాజ్యాంగ విలువల్ని కాలరాస్తూ.. ప్రజాస్వామిక సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ అధికార దాహంతో ముందుకెళ్లిన మోడీ-అమిత్ షా ద్వయానికి చివరకు గట్టి ఎదురుదెబ్బతప్పలేదు. దక్షిణాదికి ముఖద్వారంగా చెప్పుకున్న కర్ణాకటలో గెలిచి, తమకు తిరుగేలేదనీ చెప్పాలని చూసిన బీజేపీ, దాని అదృశ్యశక్తులకు ఊహించని షాక్ తగిలింది. అటు కాంగ్రెస్ నేతల చురుకైన పాత్ర, దేశవ్యాప్తంగా పెరిగిన ఒత్తిడితో యెడ్డీ మూడురోజుల ముఖ్యమంత్రిగా తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.
మొత్తంగా కన్నడనాట 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవరించినా.. అధికారం కోసం అనైతికంగా వ్యవహరించిన తీరుతో దేశంముందు అభాసుపాలయ్యాడు యెడ్డీ. ఇప్పుడు కన్నడ నుంచి కమలంపై సమరభేరి మోగించేందకు విపక్షాలన్నీ సన్నద్ధమవుతున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ వాజూభాయ్ వాలా ఆహ్వానించడంతో ఈనెల 23న ప్రమాణస్వీకరాం చేసేందుకు జేడీఎస్ నేత కుమారస్వామి సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి, తదిత ప్రాంతీయ పార్టీల నేతలందరినీ కుమారస్వామి ఆహ్వానించారు.
ఆయన ప్రమాణస్వీకారోత్సవం వేదిక నుంచి బీజేపీపై సమరశంఖం పూరించే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీలో బలపరీక్షకు ముందే బీజేపీ నేత, ముఖ్యమంత్రి యెడ్డీ ఓటమిని అంగీకరించడంతో ఇది ప్రజాస్వామ్య విజయంగా పలుప్రాంతీయ పార్టీల నేతలు అభిప్రాయ పడ్డారు. ప్రధానిమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారంటూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక 2019లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ రూపొందించుకున్న ప్రణాళికలు విఫలం అవుతున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి అభిప్రాయ పడ్డారు.
ఇక ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్కేజ్రీవాల్ మాట్లాడుతూ కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని అన్నారు. ఇలా బీజేపీయేతర పార్టీలను కన్నడ రాజకీయ పరిణామాలు ఒక్కతాటిపైకి తెస్తున్నాయి. అయితే ఈనెల 23న కుమారస్వామి ప్రమాణస్వీకారం నాడు బీజేపీయేత పక్షాలన్నీ కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.