మొన్నటి వరకు కర్ణాటక రాజకీయం ఎంత ఉత్కంఠంగా సాగిందో యావత్ భారత దేశానికి తెలిసిందే. బీజేపీ అభ్యర్థి అయిన యడ్యూరప్పను ఆఘమేఘాల మీద సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. కాకపోతే కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకోవడంతో బీజేపీకి దెబ్బ పడింది. నిన్న అసెంబ్లీ లో యడ్యూరప్ప బలనిరూపణ చేయలేకపోవడంతో రాజీనామా చేశారు. ఈ క్రమంలో బీజేపీపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి..ఎలాంటి మెజార్టీ లేకున్నా తమ ఇష్టానుసారంగా గవర్నర్ చే ప్రమాణ స్వీకారం చేయించారని..స్పీకర్ ని కూడా నియమించారని కేంద్రంపై విమర్శలు వచ్చాయి.
కర్ణాటక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఎత్తులు పైఎత్తులతో రాజకీయాన్ని మరింత రక్తికట్టించాయి. చివరికి అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ అధికారంతోపాటు తమ పార్టీ పరువు, ప్రతిష్టను కూడా పోగొట్టుకుంది.కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీజేపీ విఫలమవడంపై ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ స్పందించారు. చెన్నైలో మక్కల్ మండ్రమ్ మహిళా విభాగం కార్యకర్తలతో రజనీకాంత్ ఈరోజు భేటీ అయ్యారు.
అనంతరం, రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయాలని బీజేపీ చూసిందని, సుప్రీంకోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని సంతోషం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యమే గెలిచిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు సరైన సమయంలో స్పందించినందుకు కృతజ్ఞతలు. ఇవాళ కోర్టు ఆదేశాల వల్లే ప్రజాస్వామ్యం గెలిచింది అని రజనీకాంత్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయమై రజనీకాంత్ స్పష్టంగా చెప్పలేదు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పుడు ఈ విషయం స్పష్టం చేస్తానని, ఇతర పార్టీలతో పొత్తు గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని స్పష్టం చేశారు.