కర్నాటక రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఎంతో ఆర్భాటంతో ప్రమాణస్వీకారం చేసిన బిజెపి నేత యడ్యూరప్ప ఆనందం మూణ్ణాల ముచ్చటే అయిపోయింది. ఇక మిగిలింది జెడిఎస్ నేత కుమారస్వామి వంతే. ఆయన బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత బల నిరూపణ చేసుకోవాలి. ఎన్ని రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలన్నది గవర్నర్ వాజూభాయ్ వాలా నిర్ణయంపై ఆధారపడుంటుంది. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారమైతే బలనిరూపణలో కుమారస్వామి గట్టెక్కటం ఇప్పటికైతే పెద్ద కష్టం కాదు. ఎందుకంటే, బలనిరూపణకు మ్యాజిక్ ఫిగర్ 112. కాంగ్రెస్, బిజెపి కూటమికి ఇపుడు 115 ఎంఎల్ఏలున్నారు. కాబట్టి బలనిరూపణలో గట్టెక్కట కష్టం కాదు.
అసంతృప్తి తప్పదా ?
బలనిరూపణలో గట్టెక్కిన తర్వాతే కుమారస్వామికి అసలు సమస్యలు మొదలవుతాయన్నది విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ లో మెజారిటీ ఎంఎల్ఏలకు జెడిఎస్ కు మద్దతు పలకటం ఇష్టంలేదని సమాచారం. అందులోనూ కుమారస్వామి అంటే చాలామంది ఎంఎల్ఏలకు పడదట. దాంతో పైకి చెప్పటం లేదుకానీ లోపల్లోపల మాత్రం కాంగ్రెస్ ఎంఎల్ఏల్లో మద్దతు విషయంలో అసంతృప్తి ఉందట. అసంతృప్తి ఎప్పుడు బయటపడుతుందంటే మంత్రివర్గం ఏర్పాటులో బయటపడుతుంది. మంత్రి పదవులను ఆశించే వారి సంఖ్య చాలా ఉంది. అటువంటి వారికి మంత్రిపదవులు రాకపోతే వెంటనే కుమారస్వామిపైనో లేకపోతే కాంగ్రెస్ నాయకత్వంపైనో అసంతృప్తి మొదలవ్వటం ఖాయం.
మూణ్ణాళ ముచ్చటేనా ?
ఎప్పుడైతే కుమారస్వామి పై అసంతృప్తి మొదలవుతుందో అటువంటి ఎంఎల్ఏలకు గాలం వేయటానికి బిజెపి నేతలు సిద్ధంగా ఉంటారు. మొన్న విఫలమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బిజెపి నేతలు కాంగ్రెస్, జెడిఎస్ ఎంఎల్ఏలకు గాలం వేయటం ఖాయం. ఎప్పుడైతే బిజెపి గాలానికి కాంగ్రెస్, జెడిఎస్ ఎంఎల్ఏలు తగులుకున్నారో కుమారస్వామి ప్రభుత్వానికి మూడినట్లే. అంటే కుమారస్వామి ప్రభుత్వం ఆయుష్ణు కూడా ఎక్కువ రోజులుంటుందని అనుకునేందుకు లేదు. కర్నాటకలో జనాలు కూడా అదే విషయాన్ని చర్చించుకుంటున్నారు.
అప్పుడేమవుతుంది ?
ఒకవేళ కుమారస్వామి ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులుండకపోతే కర్నాటకలో ఏమవుతుంది ? ఇదే విషయం కర్నాటక రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే, బలనిరూపణకు కుమారస్వామికి అవసరమైన సంఖ్య 112. ప్రస్తుత బలం 115. అంటే అవసరమైన దానికన్నా అదనంగా ఉన్నది కేవలం మూడంటే ముగ్గురు ఎంఎల్ఏలు మాత్రమే. మంత్రివర్గం తర్వాత ఓ నలుగురిలో అసంతృప్తి మొదలైతే కుమారస్వామి ప్రభుత్వానికి మూడినట్లే. లేదంటే ఎంఎల్ఏల గొంతెమ్మ కోరికలను తీర్చటానికే కుమారస్వామి పదవీ కాలం సరిపోతుంది. ఎందుకంటే, ప్రతీ ఎంఎల్ఏ కూడా చాలా కీలకమే అవుతారు కాబట్టి ముఖ్యమంత్రికి వేరే దారి కూడా లేదు.
రాష్ట్రపతి పాలనా ? మళ్ళీ ఎన్నికలా ?
ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి మళ్ళీ బిజెపి అధికారంలోకి వచ్చినా అప్పుడు కూడా జరిగేది దాదాపు ఇదే. ఆ విధంగా ప్రభుత్వాలు తరచూ మారుతుంటే చివరకు రాష్ట్రపతి పాలన తప్ప మార్గం లేదు. ఎటూ జెడిఎస్ లోనే మూడు వర్గాలున్న విషయం అందరికీ తెలిసిందే. కుమారస్వామి సోదరుడు రేవణ్ణలో కానీ మద్దతుదారుల్లో కానీ అసంతృప్తి మొదలైతే చాలు ప్రభుత్వం పడిపోవటానికి. కుమారస్వామి స్ధానంలో బిజెపి రావచ్చు లేదంటే వెంబడే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సొచ్చినా ఆశ్చర్య పడక్కర్లేదు. ఏదేమైనా కుమారస్వామి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చూడాలి రాజకీయాలు ఎలా మారుతాయో ?