సీఎం చంద్రబాబు ఆశీస్సులతో రెండోసారి రాజ్యసభ కోటాలో ఎంపీ అయిపోయిన సీఎం రమేశ్ తీరుతో సొంత పార్టీ నేతలే ఖంగుతింటున్నారు. పార్టీకి ఆర్థికంగా అండదంగా ఉంటూ.. టీడీపీ అధినేతకు సన్నిహితంగా మెలుగు తుండటంతో జిల్లాలో ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. నేతలు కూడా ఇన్నాల్లూ కిక్కురుమనకుండా సర్దుకుపోతున్నారు. అయితే చంద్రబాబు ఆండదండలు చూసుకునో లేక తానొక్కడినే జిల్లాను శాసిస్తున్నా అనుకుం టున్నారో ఏమోగానీ.. ఇప్పుడు ఆయన నియోజకవర్గాల్లోనూ వేలు పెడుతున్నాడు. తనది కాని నియోజక వర్గాల్లో తలదూరుస్తుండటంతో సొంత పార్టీ నేతలే ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తో పాటు పొద్దుటూరు నేతలతో పాటు ఆయన స్వయంగా పార్టీలోకి తీసుకొచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యే, మంత్రి ఆది కూడా సీఎం రమేశ్పై ఫైర్ అవ్వడం జిల్లా రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది.
ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా కడపలో పాగా వేయాలని టీడీపీ నేతలు ఎంత ప్రయత్నిస్తుంటే.. అంత కంటే ఎక్కువగా సొంత పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఆ జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేశ్ వ్యవహార శైలితో ఇవి మరింత తీవ్రమవుతున్నాయి. కడపలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను పార్టీ అధినేత చంద్రబాబు.. రమేశ్ చేతుల్లో పెట్టారు. దీంతో ఆయన ఎంత చెబితే అంత అన్నట్లు పరిస్థితి మారిపోయింది. దీంతో పాటు ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయాల్లో సీఎం రమేశ్ జోక్యం చేసుకోవడంతో సీనియర్లు కూడా మండి పడుతున్నారు. ఇప్పటివరకూ నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి వర్గీయులు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. మొన్నటికి మొన్న జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి వ్యతిరేక వర్గమైన రామసుబ్బారెడ్డి సీఎం రమేశ్పై ఫైర్ అయ్యాడు. రమేశే ఆదిని పార్టీలోకి తీసుకువచ్చాడు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పుడు తనను పార్టీలోకి తీసుకొచ్చిన రమేశ్పైనే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీఎం రమేష్ ప్రతి పనికీ అడ్డొస్తే.. కనిపిస్తే కాల్చివేత రోజులొస్తాయంటూ హెచ్చరించారు. పోట్లదుర్తి కుటుంబీకులకు చెప్పులతో కొట్టే రోజులు వస్తాయంటూ తీవ్ర స్వరంతో స్పందించారు. ప్రతి దానికి అడ్డుపడటమేకాకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారని, తాను గన్లాంటి వాడిని.. కార్యకర్తలు బుల్లెట్లను అందిస్తే తన పని కాల్చడమేనంటూ ఆది చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆదివారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కొంత మంది తమపై అసభ్యకరంగా మాట్లాడుతు న్నారని, తాను మార్కెట్ యార్డులో కూపన్లు అమ్ముకున్నానని ప్రచారం చేయడం నీచమన్నారు.
రాజ్యసభ సభ్యుడు రమేష్ నియోజకవర్గంలో పనులు చేసుకుంటున్నారని, ఇక్కడ ఉన్న నాయకులు కాకుండా వారు వందల కోట్ల పనులు చేసుకుంటున్నా తాము పట్టించుకోవడంలేదన్నారు. గతంలో కొండాపురంలో ముంపువాసుల కాలనీల్లో చేపట్టిన పనులకు అడ్డుపడితే ఏమి జరిగిందో తెలుసుకోవాలని సూచించారు. భవిష్యత్లో ఏమి జరిగినా తాను కార్యకర్తలతో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అయితే సీఎం రమేశ్.. జిల్లాలో ప్రొద్దుటూరుతో పాటు చాలా నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నాడటంతో అంతా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరి ఇప్పటికైనా రమేశ్ తీరు మారుతుందో లేదో వేచిచూడాల్సిందే!!