ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, హామీల అమలుకు చిత్తశుద్దితో కృషి చేయటం మన రాజకీయ నేతలకు అలవాటు లేదన్న విషయం ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాటలు కూడా అవే విషయాన్ని రుజువుచేస్తున్నాయి. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలకు తాను అండగా ఉంటానని, తనను ఆధరించాలని ప్రచారం చేసుకున్నారు. తన అనుభవాన్ని చూసి టిడిపికి ఓట్లు వేయాలని, ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతర్జాతీయ రాజధానిని నిర్మిస్తానని, ప్రత్యేకహోదా సాధిస్తానని, కాపులను బిసిల్లోకి, బోయలను ఎస్టీల్లో చేరుస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. రుణమాఫీ చేస్తానని ఇలా సుమారు 600 హామీలిచ్చారు. చంద్రబాబు హామీలను చూసి నిజమే అని జనాలు కూడా అనుకున్నారు. అందుకనే చంద్రబాబు పూర్వపు పరిపాలనను మరచిపోయి జనాలు ఆధరించారు.
తడాఖా చూపిస్తున్న చంద్రబాబు
మొత్తానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తన తడాఖా చూపించటం మొదలుపెట్టారు. పూర్వపు పరిపాలకన్నా అధ్వాన్నంగా పాలిస్తున్నట్లు ఆరోపణలు, విమర్శలను మూటగట్టుకుంటున్నారు. ప్రభుత్వంపై జనాల్లో ఎంతటి వ్యతిరేకత కనబడుతున్నా పాలనా విధానాన్ని మార్చుకోకపోగా మరింత అస్తవ్యస్ధమైపోతోంది. ముఖ్యమంత్రి అవ్వక ముందేమో ప్రజలకు అండగా తానుంటానని చెప్పిన చంద్రబాబు ఇపుడేమో ప్రజలే తనకు అండగా నిలవాలని వేడుకుంటున్నారు. అంటే చంద్రబాబులోని బేలతనం స్పష్టంగా కనబడుతోంది. కేంద్రంతో సంబంధాలు చెడిపోయిన నేపధ్యంలో తనపై ఏ రూపంలో కేసులు పడతాయో అన్న భయం చంద్రబాబులో కనబడుతోంది. అందుకే తనకందరూ రక్షణగా నిలవాలని బ్రతిమాలుకుంటున్నారు.
జగన్ ను నోటికొచ్చినట్లు మాట్లాడిన పవన్
ఇక, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ది ఇంకో దారి. ఒకపుడు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు విమర్శించారు. జగన్ దృష్టంతా ముఖ్యమంత్రి కుర్చీ మీదేనంటూ మండిపడ్డారు. ప్రజలక సేవ చేయాలంటే సిఎం అయితే తప్ప సాధ్యం కాదా అంటూ నిలదీశారు. తానుమాత్ర అధికారం కోసమో ముఖ్యమంత్రి కుర్చీ మీద ఆశతోనో రాజకీయాల్లోకి రాలేదంటూ జనాలను నమ్మించే ప్రయత్నాలు చాలానే చేశారు. అయితే, పరిస్ధితుల్లో మార్పు వచ్చేసింది. జగన్ పై పవన్ విరుచుకుపడినపుడు జనసేన, టిడిపిలు ఒకటే. అయితే ఇపుడు చంద్రబాబుకు పవన్ బద్ద విరోధిగా మారిపోయారు. దాంతో పవన్ స్వరంలో కూడా మార్పు వచ్చేసింది.
మాట మీద నిలబడే అలవాటు లేదా ?
ఈమధ్య జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ, జనాలు తనకు అధికారం అప్పగిస్తే సేవ చేసుకుంటానంటూ అభ్యర్ధించటం విచిత్రంగా ఉంది. తనకు అధికారం అప్పగిస్తే జనాలకు సేవ చేసేందుకు అవకాశం వస్తుందంటూ చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పవన్ తాజా వ్యాఖ్యలను గమనిస్తే అప్పట్లో జగన్ పై చేసిన విమర్శలు పవన్ కు గుర్తుండకపోయినా జనాలకైతే గుర్తుంటాయి కదా ? అంటే నేతల స్టేట్మెంట్లు, ఇచ్చే హామీలన్నీ అవసరాలు, సందర్భాన్ని బట్టే ఉంటాయన్న విషయం పై ఇద్దరు నేతల వైఖరిని బట్టి అందరికీ అర్ధమైపోవటం లేదా ? ఎవరికైనా ఎనీ డౌట్ ?