ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి వస్తున్న ఏపీ (రాజధాని) ఎక్స్ ప్రెస్ భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. మంటల్లో నాలుగు బోగీలు దగ్ధమయ్యాయి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 11.15 గంటల సమయంలో ప్యాంట్రీ కారుకు ముందున్న బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఇవి బి-5, బి-6, బి-7 బోగీలకు కూడా వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
తాజాగా ప్రమాదానికి సంబంధించిన విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో రెండు కోచ్ లలో 65 మంది విశాఖ ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 36 మంది ట్రైనీ ఐఏఎస్ లు కూడా ఉన్నారు. అయితే, అందరూ కూడా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఉదయం 6 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖకు రైలు బయల్దేరింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడటంతోనే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. సిగ్నల్ ఇచ్చి ఉంటే రైలు అక్కడి నుంచి కదిలేదని.. అదే జరిగితే పెను ప్రమాదం జరిగేదని ప్రయాణికులు చెబుతున్నారు. రైలు ఆగి ఉండటంతోనే ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. ఏపీ ఎక్స్ప్రెస్ ప్రమాద విషయం తెలియడంతో ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ వారి క్షేమ సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నంబర్లను కేటాయించారు.