తెలుగుదేశం పాలనలో మన తెలుగువారి సనాతన ఆరాధ్య దైవం శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో జరగరాని అపచారాలు జరుగుతున్నట్లు రోజూ వార్తలు వస్తున్నాయి. ఇది తెలుగువారికే కాదు ఆ సేతు శీతాచలం భారతంలో హైందవ జాతి హృదయాలలో పెల్లుబుకుతున్న బడబాగ్నిని మరింతగా రగుల్చుతున్నాయి. అక్కడ జరిగే అక్రమాల పై పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ పెద్దారపు చెన్నారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రజాతికి స్వర్ణయుగాన్ని ప్రసాధించిన ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయులు స్వామిని ఏడుసార్లు దర్శించుకున్న ప్రతి సందర్భంలో సమర్పించిన అనేక నవరత్న ఖచిత, ప్రధానంగా వజ్ర ఖచిత ఆభరణాలు మాయమయ్యాయని వెల్లడించారు. శ్రీవేంకటేశ్వరునికి రాయలవారు సమర్పించిన భక్తితో అనురక్తితో స్వర్ణాభరణాలను చాలా వరకు కరిగించారని, అనేక వజ్రాలు విదేశాలకు కూడా తరలి పోయాయని పేర్కొన్నారు.
శ్రీ కృష్ణ దేవరాయలు ఇచ్చిన ఆభరణాలు, వజ్రాలు పది శాతం కూడా ఇప్పుడు టిటిడి ఆదీనంలో లేవని తెలిపారు. తాను డైరెక్టర్గా ఉన్నప్పుడు భక్తులు ఇచ్చిన అభరణాలపై 2012లో పరిశీలనకు, విచారణకు ఒక కమిటి వేశామని, సదరు కమిటీ విచారణలో ఈ విషయాలు బయట పడ్డాయని స్పష్టం చేశారు.
మరో వైపు టీటీడీ అధికారులతో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం టిటిడి ఎక్జెక్యూటివ్ ఆఫీసర్ మాట్లాడుతూ, టీటీడీ నిధులు ఎక్కడా దుర్వి నియోగం కాలేదని తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారమే పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని అంశాలపై చట్ట ప్రకారం ముందుకు వెళతామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. స్వామివారి ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నా యని, వాటికి సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి కి అందచేసినట్లు ఆయన పేర్కొన్నారు.