గత కొన్ని రోజులుగా కర్ణాటకలో ఎన్నికల హడావుడి ఏ రేంజ్ లో కొనసాగిందో అందరికీ తెలిసిందే. ఈ నెల 12న కర్ణాటక ఎన్నికలు జరుగగా..15 న ఫలితాలు వెలువడ్డాయి. అయితే 104 సీట్లు గెలిచిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని చెప్పిన వెంటనే కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకొని 116 సీట్లు కావడంతో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ బీజేపీ అభ్యర్థి యడ్యూరప్పను సీఎంగా ప్రమాణా స్వీకారం చేయించింది.
అయితే నాటకీయ పరిణామాల మద్య అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బలనిరూపణకు ముందే తప్పుకున్న బీఎస్ యడ్యూరప్ప కొత్త వివాదానికి తెరతీశారు. ఈ నెల 12 న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఓ లేఖ రాశారు. ‘విజయ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామంలోని తాత్కాలిక షెడ్డులో ఓటర్ నమోదు ధ్రువీకరణ మెషిన్లు(వీవీపీఏటీ) దర్శనమిచ్చాయంటే ఎన్నికలలో ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్ధం చేసుకోవచ్చని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈసీ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుందని విశ్వసిస్తున్నానని యడ్యూరప్ప లేఖలో పేర్కొన్నారు.ఈవీఎంలపై రాజకీయ పార్టీల విమర్శలకు బదులిచ్చేలా రసీదు వచ్చే యంత్రాల ఉపయోగించాలని కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పోలింగ్ బూత్లోనే ఈ మెషిన్ అందుబాటులో ఉండగా..వీటిని 5 శాతం వరకు పెంచాలని సీఈసీతో జరిగిన భేటీలో మాజీ అధికారి నజీం జైదీ సూచించారు.