తమిళనాడు మరోసారి ఆందోళనలతో అట్టుడికింది. తూత్తుకుడిలో స్టెర్లైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. వంద రోజుల ఉద్యమం ఇవాళ ఉవ్వెత్తున ఎగిసిపడడంతో ఆందోళనకారులను అదుపుచేయడం పోలీసుల తరం కాలేదు..
కలెక్టరేట్ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించడం.. పోలీసులు వారిని నివారించడంతో పరిస్థితి మరింత విషమించింది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల రువ్వడంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు ఆందోళకారులు చనిపోగా సుమారు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 50వరకు ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
తూత్తుకుడిలో స్టెర్లైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా సుమారు 12 గ్రామాల ప్రజలు 100రోజులుగా ఉద్యమిస్తున్నారు. నిరాహార దీక్షలు, రిలేదీక్షలు చేపట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో ... ఇవాళ ప్రజాసంఘాల నేతృత్వంలో ఆందోళనకారులు.. పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇందులో భాగంగా ఆందోళనకారులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించడం... ఆతర్వాత జరిగిన పరిణామాలతో తూత్తూకూడి రణరంగమైంది. 4వేల మంది పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 144 సెక్షన్ తో పాటు తూత్తుకుడిలో కేబుల్, సెల్ నెట్ వర్క్ లను నిలిపివేశారు.
మరోవైపు తూత్తుకుడిలో పోలీసుల లాఠీచార్జ్ ఘటన తమిళనాడును కుదిపేస్తోంది. ప్రభుత్వ తీరును రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని రెచ్చగొట్టేవిధంగా ఆంక్షలు విధించి వారిపై అమానుషంగా దాడి చేయడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. సంఘటనా స్థలం వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ విమర్శించారు. ప్రభుత్వం.. ఆందోళనలను పట్టించుకోకపోవడం వల్లే.. ఈ పరిస్థితివచ్చిందని మండిపడ్డారు. మక్కల్ నీది మయ్యమ్ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ఎండీఎంకే చీఫ్ వైగో తో పాటు వామపక్షాలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రజనీకాంత్ కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. సీఎం పళనిస్వామి ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలన్నారు.