టెన్నీస్ స్టార్ సానియా మిర్జాకు మరో వివాదం చుట్టుకుంది.చికెన్ ఆరోగ్యకరమని, ఫిట్నెస్కు సహకరిస్తుందంటూ సానియా మిర్జా చెబుతున్నట్లుగా ఆల్ ఇండియా పౌల్ట్రీ డెవలప్మెంట్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ అడ్వర్టైజ్మెంట్ను రూపొందించింది. ఈ యాడ్ ఫిబ్రవరి 28న ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైంది. ఆమె నటిస్తున్న పాల్ట్రీ యాడ్ అభ్యంతరకరంగా ఉందని పేర్కొంటూ ఆ యాడ్ నుంచి తప్పుకోవాలని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) సానియాకు అల్టిమేటం జారీ చేసింది.
ఒక రోల్ మోడల్ ఉన్న సానియా ఇలాంటి ప్రకటనల్లో నటించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సానియా ముందు రెండు ఆప్షన్లు ఉంచారు. ఆ యాడ్ నుంచి సానియా వెంటనే తప్పుకోవాలి..లేదా అడ్వర్టైజ్ మెంట్ ను కొత్తగా రూపొందించాలని కోరారు. భారత్లో ఉన్న పౌల్ట్రీ ఫామ్లు కోళ్లను ఎలా పెంపొందిస్తున్నాయన్న దానిపై సీఎస్ఈ విపులంగా ఓ నివేదికను విడుదల చేసిందికొలిస్టిన్ అనే యాంటీ బయోటిక్ అనే ఔషదాన్ని కోళ్లపై ప్రయోగిస్తున్నారని , అది చాలా ప్రమాదకరమని నివేదికలో పేర్కొంది.
సాధారణంగా కొలిస్టిన్ను తీవ్ర వ్యాధిగ్రస్తుల కోసం వాడుతుంటారు. పైగా చాలా దేశాల్లో దీనిపై నిషేధం ఉంది. కానీ, భారత్లో మాత్రం కోళ్లు వ్యాధిబారిన పడకుండా, అవి బరువు పెరిగేందుకు పౌల్ట్రీఫామ్ యాజమాన్యాలు దీనిని విరివిగా వినియోగిస్తున్నాయి. కాగా, ఈ యాడ్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నదని అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా తేల్చినట్లు సీఎస్ఈ వెల్లడించింది. దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఓ పౌల్ట్రీ అడ్వర్టైజ్మెంట్తో తనకు ఎలాంటి సంబంధం లేదని బహిరంగంగా చెప్పాలని సీఎస్ఈ సానియా మీర్జాను కోరింది.
మరోవైపు తాము యాంటీ బయాటిక్స్ను దుర్వినియోగం చేయడం లేదని ఆ యాడ్ చెప్పడం అబద్ధమని సీఎస్ఈ స్పష్టంచేసింది. 2014లో జరిపిన పరీక్షల్లో చికెన్లో యాంటీ బయాటిక్స్ అవశేషాలను సీఎస్ఈ గుర్తించింది. మే 23వ తేదీలోగా యాడ్ను సవరించాలని లేదా తొలగించడమో చేయాలని అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆలిండియా పౌల్ట్రీ డెవలప్మెంట్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ను ఆదేశించింది.