రాజుకున్న తిరుమల శ్రీవారి వివాదం ఎవరి మెడకు చుట్టుకుంటుందో అర్ధం కావటం లేదు. ఒకవైపు చంద్రబాబునాయుడుపైనే ఆరోపణలు వినిపిస్తుండగా, ఇంకోవైపు దీక్షితులుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని టిటిడి యోచిస్తోంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వెలుగు చూస్తున్న ఆరోపణలనే అంది పుచ్చుకోవాలని బిజెపి ప్లాన్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి శ్రీవారి వివాదం చివరకు ఏ మలుపులు తిరుగుతుందో అని టెన్షన్ అందరిలోనూ మొదలైంది. శ్రీవారికి చేయాల్సిన ధూప, దీప, నైవేద్యాల్లోనే కాకుండా కైంకర్యాల్లోను అపచారం జరుగుతోందని మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయలతో పాటు అనేకమంది రాజులిచ్చిన కోట్లాది రూపాయల విలువైన వజ్రాభరణాలు కూడా కనబడటం లేదని దీక్షితులు పదే పదే ఆరోపిస్తున్నారు. టిటిడి పై ప్రభుత్వం పెత్తనం పెరిగిపోవటంతోనే శ్రీవారి ఆలయంలో అపచారాలు పెరుగుతున్నాయని చంద్రబాబునాయుడునే లక్ష్యంగా చేసుకుని దీక్షితులు ధ్వజమెత్తుతున్నారు. అదే సమయంలో దీక్షితుల ఆరోపణలను టిటిడి ఇవొ అనీల్ కుమార్ సింఘాల్ కొట్టేస్తున్నారు.
ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులేనా ?
అయితే, తాజాగా శ్రీవారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పదే పదే ఆరోపణలు చేస్తున్న రమణదీక్షితులు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తో పాటు ఓ జాతీయ ఛానల్ పైనా క్రిమినిల్ కేసులు నమోదు చేయాలని టిటిడి ఈవోను ప్రభుత్వం ఆదేశించినట్లు ప్రభుత్వ మద్దతు మీడియాలో విస్తృతంగా ప్రచారం మొదలైంది. అందుకు అవసరమైన అన్నీ అవకాశాలను పరిశీలించాలంటూ ప్రభుత్వం టిటిడి లీగల్ డిపార్ట్ మెంటును ఆదేశించిందట. న్యాయనిపుణులు కూడా అదే అంశాలపై సీరియస్ గా ఉన్నారట. ఇదే విషయమై చంద్రబాబు టిటిడి పాలకమండలి ఛైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో సింఘాల్ తో ప్రత్యకంగా సమీక్షించారట. ఈ సమీక్షతోనే దీక్షితులు తదితరులపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్ధమైపోతోంది.
దెబ్బతింటున్న మనోభావాలు
శ్రీవారి సేవల్లో లోపాలు, టిటిడిలో అవినీతి, వందల కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలు మయమైపోవటం లాంటి అంశాలను పక్కనపెడితే ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలతో తిరుమల పవిత్రత మంటకలుస్తున్న మాట మాత్రం వాస్తవం. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు కూడా పూర్తిగా దెబ్బ తింటోంది. ఒక రకంగా చూస్తే దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో కొత్తేమీ లేదు. విలువైన వజ్రాభరణాలు మాయమైపోయాయన్నది పాత ఆరోపణే. రాజుల కాలం నాటి ఆభరణాలకు సరైన లెక్కలు లేదన్న ఆరోపణలు కూడా పాతవే. టిటిడిపై ప్రభుత్వ పెత్తనం పెరిగిపోయిందన్న ఆరోపణలూ వాస్తవమే. ఇక, వందల కోట్ల రూపాయల విలువైప పింక్ వజ్రం మాయమైపోయిందని దీక్షితులు తాజాగా చేస్తున్న ఆరోపణలపై విచారణ చేయిస్తేకానీ నిజాలేంటో తేలదు.
ప్రభుత్వ వాదనేంటి ?
కేవలం వ్యక్తిగత స్వార్ధంతోనే దీక్షితులు శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తున్నట్లు ప్రభుత్వం ప్రత్యారోపణలు చేస్తోంది. అయితే, ఇందులో వాస్తవం పెద్దగా లేదని సమాచారం. ఎందుకంటే, గడచిన నాలుగేళ్ళుగా దీక్షితులు చంద్రబాబు లక్ష్యంగా పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. దీక్షితులను పక్కన పెట్టేందుకు హటాత్తుగా 65 ఏళ్ళ రిటైర్మెంట్ అన్న నిబంధనను టిటిడి పాలకమండలి తెరపైకి తెచ్చింది. 65 ఏళ్ళు దాటిన అర్చకులకు రిటైర్మెంట్ ఇవ్వాలన్న నిబంధనలో నిజాయితీ కనబడటం లేదు. నిబంధనను అమలు చేయాలనుకుంటే దీక్షితులను ఎప్పుడో రిటైర్ చేసుండాల్సింది. ఎప్పుడో 65 ఏళ్ళు నిండిన దీక్షితులను ఇపుడే ఎందుకు రిటైర్ చేయించినట్లు ? ఇక్కడే చంద్రబాబు ఉద్దేశ్యం బయటపడుతోంది. పైగా దీక్షితులు తప్పులు చేశారని చెబుతున్న ప్రభుత్వం అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు ?
చంద్రబాబు చుట్టూ ఉచ్చు ?
సందట్లో సడేమియాలాగ టిటిడి ఉదంతాన్ని చంద్రబాబు మెడచుట్టూ బిగించాలని బిజెపి నేతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కనబటం లేదని దీక్షితులు చెబుతున్న శ్రీవారి పింక్ వజ్రం వ్యవహారాన్నే బిజెపి చంద్రబాబుపై ఆయుధంగా ప్రయోగించాలని యోచిస్తోంది. అందుకే అదే విషయాన్ని బిజెపి నేతలు పదే పదే ప్రస్తావిస్తూ సిబిఐ విచారణను డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ సుప్రింకోర్టులో పిటీషన్ వేస్తానంటూ బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి ప్రకటించటంతో ప్రచారానికి మద్దతు లభిస్తోంది. మొత్తానికి చంద్రబాబును ఇరికించటానికి బిజెపి నేతలు తెరవెనుక పెద్ద ప్లానే వేస్తున్నట్లు అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. చివరకు శ్రీవారి వివాదం ఎవరి మెడకు చుట్టుకుంటుందో చూడాలి.