ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి. అధికార్టీ నేతల ఇళ్ళపైనే ఐటి, పోలీసులు దాడులు జరుగుతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మామూలుగా అయితే, అధికారపార్టీ నేతలపై పోలీసులు, ఐటి అధికారుల దాడులు జరుగుతాయని ఎవ్వరూ ఊహించరు. అయితే, ఎవ్వరూ ఊహించనిదే ఇక్కడ జరుగుతోంది. తాజాగా ఫిరాయింపు ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటి దాడులు జరగటం అందులో భాగమే. వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన జ్యోతుల ఇంటిపైనే ఐటి అధికారుల దాడులు జరిగాయి. జగ్గంపేట ఎంఎల్ఏ జ్యోతుల స్వగ్రామమైన ఇర్రిపాకలో ఒక్కసారిగా ఐటి అధికారులు చేసిన దాడులతో జిల్లాలో కలకలం రేగుతోంది. అధికార పార్టీ నేతలపై దాడులు జరగటం ఇదే మొదటిసారి కాదన్న విషయం అందరికీ తెలిసిందే.
నెల్లూరు ప్రజా ప్రతినిధులపై దాడులు
నెల్లూరు జిల్లాలో స్ధానిక సంస్దల ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటితో పాటు కార్యాలయాలపై సిబిఐ దాడులు చేసింది. బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణలపై ఎంఎల్సీపై కేసు నమోదైంది. దాంతో వాకాటి ఎవరికీ కనబడకుండా మాయమైపోయారు. అయితే, చివరకు సిబిఐ అధికారులు పెద్ద వ్యూహం పన్ని బెంగుళూరులోని కార్యాలయంలో వాకాటిని పట్టుకుని అరెస్టు చేశారు. అదే విధంగా ఎంఎల్ఏ బొల్లినేని రామారావు పై మహారాష్ట్రలో ఏసిబి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఎంఎల్ఏ పై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు.
గంటా, సుజనా చౌధరిపై కేసు
కేంద్రమాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌధరిపై ఏకంగా నాంపల్లి కోర్టు నాన్ బెయిల్ బుల్ అరెస్టు వారెంటునే జారీ చేసింది. మారిషస్ బ్యాంకును రూ. 100 కోట్లకు మోసం చేశారన్న ఆరోపణలపై కోర్టే కేసు నమోదు చేయమని పోలీసులను ఆదేశించటం గమనార్హం. కోర్టులో ఆ కేసు ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. మంత్రి గంటా శ్రీనివాసరావుది ఇంకో కథ. ఈయనపైన కూడా బ్యాంకులను మోసం చేశారన్నా ఆరోపణలున్నాయి. ఎస్బిఐ బ్యాంకును సుమారు రూ. 400 కోట్లకు మోసం చేశారంటూ గంటాపై పోలీసులు కేసు నమోదు చేశారు. గంటా ఆస్తులను బ్యాంకు ఏకంగా జప్తు చేస్తూ ప్రకటనే జారీ చేయటం విచిత్రం.
చింతమనేని రూటే సపరేటు
దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ పై ఏకంగా సుమారు 30 కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ పై గతంలో దాడి చేసిన ఘటనలో దెందులూరు కోర్టు 2 ఏళ్ళు జైలుశిక్షను విధించిన సంగతి తెలిసిందే. చింతమనేనిపై దొమ్మి కేసులు, మహిళలపై దాడుల కేసులే కాకుండా ఏలూరు పోలీసులైతే రౌడీషీటరే ఓపెన్ చేశారు. అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్) నివేదిక ప్రకారం మంత్రులు దేవినేని ఉమామహేశ్వరర్రావు, కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు ఎంఎల్ఏలు బండారు సత్యనారాయణమూర్తి, అనంతపురం జిల్లా ధర్మవరపు సూర్యనారాయరెడ్డిలపై పలు కేసులున్నాయి. విచిత్రమేమిటంటే అధికారపార్టీలో ఉండి కూడా పై నేతలపై అన్ని కేసులు నమోదవ్వటంతో పాటు అరెస్టు వారెంటులు కూడా జారీ అయ్యాయంటే ఇక ప్రతిపక్షంలో ఉంటే ఇంకెన్ని కేసులు నమోదయ్యేవో.