చంద్రబాబునాయుడు ఇంట్లో సిబిఐ లేదా తెలంగాణా పోలీసులతో సోదాలు చేయిస్తే విలువైన శ్రీవారి సొత్తు దొరుకుతుందంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచన ఆరోపణలు చేశారు. దోచుకున్న శ్రీవారి విలువైన ఆభరణాలన్నింటినీ చంద్రబాబు అమరావతి, హైదరాద్ లోని తన ఇంటికి తరలించినట్లు విజయసాయి ఆరోపించారు. 12 గంటల్లో సిబిఐ లేదా తెలంగాణా పోలీసులతో చంద్రబాబు నివాసాల్లో సోదాలు చేయిస్తే శ్రీవారి సొత్తంతా దొరుకుతుందన్నారు. లేకపోతే మొత్తం సొత్తును విదేశాలకు తరలించుకుపోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపించటం సంచలనంగా మారింది. చంద్రబాబు నివాసాల్లో 12 గంటల్లో గనుక సోదాలు జరగకపోతే 13వ గంటలో తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తానంటూ తీవ్రంగా హెచ్చరించటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఆరోపణలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి
రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి రకరకాల ఆరోపణలతో విరుచుకుపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వైసిపి ఎంపిలను ప్రలోభాలకు గురిచేయటం, వందల కోట్ల రూపాయలతో కొనుగోలు చేయటం, మంత్రి పదవులను ఎరగావేశారని ఇలా రకరకాలుగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో కూడా వైసిపి ఎంఎల్ఏలను కొనుగోలు చేయటానికి ప్రయత్నిస్తున్నారని ఇటీవలే చేసిన ఆరోపణలతో చంద్రబాబు బాగా ఇబ్బందులు పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చంద్రబాబును రాజ్యసభ సభ్యుడు ఆరోపణలతో, విమర్శలతొ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దాంతో విజయసాయి దెబ్బకు టిడిపి విలవిల్లాడుతోంది.
టిటిడికి చంద్రబాబుకు ముడి
తిరుమలలోని శ్రీవారి కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలు మాయమయ్యాయన్న మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల ఆరోపణలను విజయసాయి అంది పుచ్చుకున్నారు. తిరుమల ఆలయంకు సంబంధించి దీక్షితులు చేస్తున్న ఆరోపణలకు మెల్లిగా రాజకీయంగా మద్దతు లభిస్తోంది. ముందుగా రాష్ట్రంలోని బిజెపి నేతలు మద్దతు పలకగా తరువాత వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తర్వాత బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి దీక్షితులుకు మద్దతుగా నిలిచారు. ఇపుడు జగన్ చేసిన ఆరోపణలనే విజయసాయి ఇంకా బలంగా వినిపిస్తున్నారు. ఒక్కసారిగా స్పీడందుకున్న శ్రీవారి ఆలయం వివాదం చివరకు ఏ మలుపులు తిరుగుతుందో అని అందరిలోనూ టెన్షన్ మొదలైంది.