కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బిజెపియేతర పార్టీలు తమ బలప్రదర్శనకు ఉపయోగించుకున్నాయా ? బెంగుళూరులో జరిగిన పరిణామాలు చూస్తే అందరిలోనూ అదే అనుమానాలు బలపడుతున్నాయి.ఎందుకంటే, ఈ మధ్య కాలంలో బిజెపియేతర పార్టీల సమావేశం జరిగిన దాఖలాలు లేవు. ఏదో సందర్భంలో ఒకటి, రెండు పార్టీలు కలవటం తప్ప ఇన్ని పార్టీలు కలిసిన వేదిక ఎక్కడా లేదు. అందుకు కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. ఎందుకంటే, ప్రమాణస్వీకార కార్యక్రమానికి సుమారు 18 పార్టీలు అధినేతలు కలిసారు. ఎటు తిరిగి 2019 లోక్ సభ సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రస్తుతం నరేంద్రమోడి సారధ్యంలో బిజెపి చాలా బలంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మోడిని దెబ్బకొట్టాలంటే ప్రతిపక్షాలన్నీ కలిస్తే తప్ప సాధ్యం కాదని పలు సందర్భాల్లో నిరూపితమైంది. అందుకే ఈ సందర్భాన్ని ప్రతిపక్షాలు చక్కగా ఉపయోగించుకున్నట్లే కనబడుతోంది.
ప్రతిపక్షాల్లో అనైక్యతే బిజెపికి కలిసి వస్తోందా ?
ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిపక్షాల్లో ఐక్యత లేని కారణంగానే బిజెపి గెలిచింది. మోడి సొంత రాష్ట్రం గుజరాత్ అందుకు నిదర్శనం. ఇక్కడ కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, బిఎస్పీ తదితర పార్టీలు వేటికవే పోటీ చేశాయి. చాలా నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్ధులు నానా అవస్తలు పడి గెలిచారు. చాలా నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్ధులకు వచ్చిన మెజారిటీ కన్నా మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచిన ఎన్సీపీ, ఎస్పీ, బిఎస్పీ అభ్యర్ధులకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ పార్టీలన్నీ అవగాహనతో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసుంటే బిజెపి కచ్చితంగా ఓడిపోయుండేనటంలో సందేహమే అవసరం లేదు. కర్నాటకలో కూడా కాంగ్రెస్, జెడిఎస్ కూటమిగా పోటీ చేసుంటే మంచి మెజారిటీ వచ్చేదని విశ్లేషకులు చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే.
ప్రతిపక్షాలను కలపటం చిన్న విషయం కాదు
భిన్న మనస్తత్వాలు, అజెండాలతో ఏర్పడిన ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తేవటం అంత చిన్న విషయం ఏమీ కాదు. ప్రతీ చిన్న విషయానికి ప్రాంతీయ పార్టీల అధినేతల్లో ఎక్కువమంది విపరీతంగా స్పందించే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్, బిఎస్పీ, టిఆర్ఎస్, జెడిఎస్, డిఎంకె, ఎన్సీపి లాంటి పార్టీల అధినేతలందరూ వ్యక్తిగత అజెండాలతోనే పనిచేస్తున్న విషయాన్ని అందరూ చూస్తున్నదే. బలమైన ప్రత్యర్ధిని దెబ్బ కొట్టాలంటే ప్రాంతీయ పార్టీల అధినేతలు ముందు కొంత త్యాగాలకు సిద్దపడాలి. అయితే, పై నేతల్లో ఎవరూ కూడా త్యాగాలకు సిద్ధపడే గుణం కలిగిన వారు లేరు. ఆ విషయం గతంలో చాలా సార్లు రుజువైన విషయాన్ని మరచిపోకూడదు. చిన్న చిన్న విషయాలకే మమతా బెనర్జీ, మాయావతి, కెసిఆర్, జెడిఎస్ అధినేతలు తమ కూటములను ఏకపక్షంగా వదిలేసిన సంఘటనలున్నాయి.
రాహూలే చొరవ చూపాలి
బిజెపియేతర పార్టీలను ఏకం చేయాలంటే కాంగ్రెస్ పార్టీకే అవకాశాలు ఎక్కువున్నాయి. దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి కొద్దొ గొప్పో బలముంది కాబట్టి ప్రతిపక్షాల ఐక్యతకు రాహూల్ గాంధినే చొరవ చూపాలి. ఎందుకంటే, మమతా బెనర్జీ, శరత్ పవార్, కెసిఆర్, చంద్రబాబు లాంటి అనేక మంది అధినేతలకు మూలం కాంగ్రెస్ పార్టీనే అన్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో మమతబెనర్జీ లాంటి ఒకరిద్దరికి తప్ప చాలా పార్టీల అధినేతలకు కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పని పరిస్ధితులున్నాయి వారి రాష్ట్రాల్లో. రాబోయే ఎన్నికల్లో గనుక బిజెపిని దెబ్బ కొట్టలేకపోతే అంతే సంగతులు. ఆ ఒక్క అంశమే ప్రతిపక్షాలను ఏకం చేస్తుండొచ్చు. అందుకే చంద్రబాబు బాగా చొరవ చూపుతున్నారు.
చంద్రబాబుదే హడావుడి
అన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు హాజరైన కార్యక్రమంలో చంద్రబాబుదే హడావుడి మొత్తం. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, మాయావతి, శరద్ పవార్ లాంటి అధినేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బిజెపియేతర పార్టీలు ఏకమవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారట. చంద్రబాబు ప్రతిపాదనలకు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు మద్దతు పలికినట్లు సమాచారం. అందుకే జాతీయ స్ధాయిలో బిజెపియేతర పార్టీల ఐకమత్యానికి చంద్రబాబు చొరవ చూపాలని మమతా బెనర్జీ పిలుపిచ్చారు. ఈ ప్రాంతీయ పార్టీలకు ఎటుతిరిగి వామపక్షాల మద్దతుంటుదనటంలో సందేహం అవసరం లేదు. పశ్చిమబెంగాల్లో ఉప్పు-నిప్పు లాగుండే తృణమూల్, వామపక్షాలు కూడా కలవటానికి సిద్ధమన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. మరి, ఈ ప్రతిపక్షాల ఐక్యతా రాగం ఎంత కాలం ఉంటుందో ? ఎంత ధృడంగా ఉంటుందో కాలమే చెప్పాలి.