కొత్త మిత్రులను వెతుక్కోవటంలో చంద్రబాబునాయుడు ఆతృత పడుతున్నట్లే ఉంది. అందుకు కర్నాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి పదవీ స్వీకార కార్యక్రమాన్ని చంద్రబాబు అవకాశంగా తీసుకున్నట్లు కనబడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధికి సన్నిహితమవ్వటానికి చంద్రబాబు ప్రయత్నించటం అందులో భాగమే. కాంగ్రెస్ అధ్యక్షుడైనందుకు రాహూల్ వద్దకు వెళ్ళి అభినందించటం, బిజెపిని గద్దె దింపే లక్ష్యంతో కర్నాటకలో జెడిఎస్ తో కలవటం, ముఖ్యమంత్రి పీఠాన్ని జెడిఎస్ కు వదులుకోవటం లాంటి కాంగ్రెస్ నిర్ణయాలను చంద్రబాబు అభినందించారు. రాహూల్ కు షేక్ హ్యాండ్ ఇవ్వటం, బుజం తట్టి అభినందించటం లాంటి చంద్రబాబు చర్యలు ఆందరినీ ఆకర్షించాయనటంలో సందేహం లేదు. తనంతట తానుగా రాహూల్ వద్దకు చంద్రబాబు వెళ్ళటంలోనే రాబోయే ఎన్నికల విషయంలో చంద్రబాబులో ఎంతటి అభద్రత ఉందో అర్ధమైపోతోంది. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి కలిసి పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబు చర్యలు మద్దతుగా నిలుస్తున్నాయి.
చంద్రబాబులో ఆందోళన
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే విషయంలో చంద్రబాబు ఎందుకు అంత తొందరపడుతున్నారు ? రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే చంద్రబాబు ఆందోళన అర్ధమవుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఎదురవ్వబోయే ఫలితాల విషయంలో చంద్రబాబుకు స్పష్టమైన అవగాహనుంది. పోయిన ఎన్నికల్లో అధికారం అందుకోవటానికి అనుకూలించిన అంశాలేవీ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ఉండవన్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో బిజెపి, జనసేనతో కలిసి పోటీ చేయటం చంద్రబాబుకు బాగా అనుకూలించింది. అయినా పొత్తులపై నమ్మకం లేకనే కాపులను బిసిలో చేర్చటం, బోయలను ఎస్టీల్లో చేర్చటం, రుణమాఫి, ఇంటికో ఉద్యోగం, ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి లాంటి అనేక ఆచరణ సాధ్యం కాని హామీలనిచ్చారు. అదికారంలోకి రాగానే సహజనైజం ప్రకారం ఇచ్చిన హామీలన్నీ తుంగలోతొక్కేసారు. దాంతో నాలుగేళ్ళ పాలనలో జనాల్లో చంద్రబాబు పాలనపై వ్యతిరేకేత వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలవటమన్నది చంద్రబాబు చావు బతుకుల సమస్యగా మారిపోయింది. అందుకనే చంద్రబాబులో ఆందోళన పెరిగిపోతోంది.
కొత్తమిత్రుల కోసం వెతుకులాట
వచ్చే ఎన్నికల్లో కొత్త మిత్రుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం చంద్రబాబు తప్పనిసరైంది. ఎందుకంటే, చంద్రబాబుతో బిజెపి, జనసేనలు విడిపోయాయి. వామపక్షాలు ఎప్పటి నుండో దూంరంగా ఉంటున్నాయి. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రోజురోజుకు పుంజుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్ధితుల్లో మిగిలింది కాంగ్రెస్ మాత్రమే. జనాలకు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ మీదున్నంత ఆగ్రహం వచ్చే ఎన్నికల్లో ఉండదన్నది చంద్రబాబు అంచనా. అందుకనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. జరుగుతున్నది గమనిస్తుంటే ప్రచారం నిజమే అనికూడా అనిపిస్తోంది.
పుంజుకుంటున్న జగన్
వైసిపి అధ్యక్షుడు జగన్ పాదయాత్ర సందర్భంగా బాగా పుంజుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏ సభలో మాట్లాడినా, చివరకు పార్టీ కార్యక్రమంలో కూడా జగన్ గురించే చంద్రబాబు మాట్లాడుతున్నారు. అంటే జగన్ విషయంలో చంద్రబాబు ఎంత ఆందోళనకు గురవుతున్నారో అర్ధమైపోతోంది. ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోవటం కష్టమని చంద్రబాబుకు కూడా బాగా అర్ధమైనట్లుంది. పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు జనాల్లో సంతృప్తస్ధాయిలు పెరుగుతున్నాయంటూ ఏదో ఊదరగొడుతున్నారంతే. పోయిన ఎన్నికల్లో బిజెపి, జనసేనతో కలిసి పోటీ చేసినా, ఆచరణసాధ్యం కాని హామీలిచ్చినా చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు అధికారంలో రాగలిగారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చే హామీలను జనాలు ఎంత వరకూ నమ్ముతారో చూడాల్సిందే.