టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు బెంగుళూరు లో కాంగ్రెస్ నాయకులతో స్టేజ్ ను పంచుకోవడం తో టీడిపి, కాంగ్రెస్ బంధం మళ్ళీ బలపడనున్నదని తెలుస్తుంది. అయితే టీడీపీ బీజేపీ నుంచి బయటికి వచ్చిన తరువాత టీడీపీ ఎదో ఒక రాజకీయ పార్టీ తో కలవడం అనివార్యం అయిపొయింది. నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రమే తనకు మిగిలిన అవకాశం అని చెప్పవచ్చు.
2019లో రాష్ట్రంలో మళ్లీ టీడీపీ గెలవడం ఒక ఎత్తయితే, కేంద్రంలోనూ తాను మద్దతిచ్చే పార్టీనే అధికారంలోకి రావడం మరో ఎత్తు. రాష్ట్రంలో టీడీపీ ఓడినా ఫర్వాలేదు కానీ, కేంద్రంలో మాత్రం ఎన్డీయే సర్కార్ రావద్దన్నది చంద్రబాబు ధ్యేయం. ఎందుకంటే, నోటుకు ఓటు కేసుతో పాటుగా అమరావతి కేంద్రంగా జరుగుతున్న అవినీతి చిట్టా ఇప్పుడు బీజేపీ చేతుల్లో ఉంది. నాలుగేళ్లు కలిసి కాపురం చేసినందున, ఈ కాలంలో చంద్రబాబు చేసిన కొన్ని పొరపాట్లు,చిన్న చిన్న తప్పులు కూడా ఎన్డీయేకు ఆయుధంగా మారనుంది.
ఎప్పుడెప్పుడు చంద్రబాబును జైలుపాలు చేయాలా అన్న కసితో అమిత్ షా ఉన్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. రాష్ట్రంలో బీజేపీకి లైన్ క్లియర్ చేసుకుంటూనే, ప్రజాక్షేత్రంలో టీడీపీని ఇరకాటంలో పడేసేందుకు అవసరమయ్యే ప్రణాళికను రూపొందించుకుంటోంది బీజేపీ. సీబీఐను కూడా ఉసిగొల్పేందుకు పావులు కదుపుతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.