సాధారణ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసిపిలోకి వలసలు, చేరికలు ఎక్కువవుతున్నాయి. మామూలుగా అయితే, అధికార పార్టీలోకి వలసలుంటాయి. కానీ విచిత్రంగా ప్రతిపక్షమైన వైసిపిలోకి వలసలు ఊపందుకుంటోంది. అధికార తెలుగుదేశం పార్టీలో నుండి నేతలు వైసిపిలోకి చేరుతున్నారంటే ఏదోలే అనుకోవచ్చు. టిడిపిలో తమకు టిక్కెట్టు రాదని అనుకున్న నేతలు వైసిపిలోకి చేరుతున్నారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇప్పటి వరకూ ఏ పార్టీలో లేని కొందరు వ్యాపార ప్రముఖులు అందున పెట్టుబడిదారులు వైసిపిలోకి ఎందుకు చేరుతున్నట్లు ? ఇదే ప్రశ్న పలువురిని వేధిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలవదు అన్న నమ్మకంతోనే పలువురు వైసిపిలోకి చేరుతున్నారన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. దానికితోడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా వివిధ జిల్లాల్లో బ్రహ్మరధం పడుతున్న జనాలను చూసిన తర్వాత జరుగుతున్న ప్రచారం మద్దతుగా నిలబడుతోంది.
పార్టీలో చేరిన పలువురు ప్రముఖులు
ఇప్పటి వరకూ ఎక్కువగా టిడిపి నుండే పలువురు ప్రముఖులు వైసిపిలో చేరారు. అందులోనూ రాజధాని జిల్లాల్లో ఒకటైన కృష్ణా నుండే పలువురు ప్రముఖులు అందునా చంద్రబాబునాయుడు సామాజికవర్గంలోని నేతలే చేరటం విశేషం. మొదటగా విజయవాడ తూర్పు నియోజకవర్గంకు చెందిన యలమంచిలి రవి చేరారు. తర్వాత మైలవరంకు చెందిన వసంత కృష్ణప్రసాద్ చేరారు. త్వరలో గన్నవరంకు చెందిన దాసరి జై రమేష్ చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతుకుముందు గుంటూరులో పాదయాత్ర జరుగుతుండగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జ్యోతుల చంటిబాబు చేరారు. అదే సందర్భంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు బాగా సన్నిహితుడు, నరసరావుపేట నియోజకవర్గం ఇన్చార్జి నాగేశ్వర్రావు కూడా వైసిపిలో చేరారు. వరుసబెట్టి టిడిపి నేతలే వైసిపిలో చేరటంతో టిడిపి నాయకత్వం ఆందోళన పడుతోంది.
ఉత్తరాంధ్రలో మరింత మంది
జగన్ పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరుకునే సరికి టిడిపి నుండి వైసిపిలోకి మరిన్ని చేరికలుంటాయని ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే పలువురు వ్యాపార ప్రముఖులు వైసిపిలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. విశాఖపట్నంలో ప్రముఖ బిల్డర్లలో ఒకరైన ఎంవివి బిల్డర్స్ అధినేత ఎంవివి సత్యనారాయణ వైసిపిలో చేరనున్నారు. తణుకులో జరిగే బహిరంగ సభలో సత్యనారాయణ వైసిపి కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు స్ధానం నుండి పోటీ చేయటానికి బాగా ఆశక్తి చూపుతున్నారు. టిక్కెట్టు ఇచ్చేది లేంది తేలకపోయినా ముందు వైసిపిలో అయితే చేరుతున్నారు.
లోక్ సభ స్ధానాల్లో అందరూ ప్రముఖులే
వచ్చే ఎన్నికల్లో లోక్ సభ స్ధానాల్లో అందరూ ప్రముఖులనే పోటీలోకి దింపాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. టిడిపి అభ్యర్ధులను ఢీ కొనాలంటే ఆర్ధికంగా గట్టి స్దితిలో ఉన్న వారినే పోటీలోకి దింపక తప్పని పరిస్దితి జగన్ ది. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున ఎంపిలుగా పోటీ చేసే అభ్యర్ధుల్లో ఎక్కువమంది ఆర్ధికంగా పటిష్టమైన స్ధితిలో ఉన్న వారే దిగుతారనటంలో సందేహం లేదు. అందునా పార్లమెంటు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి లోక్ సభ కు పోటీ చేసే అభ్యర్ధులు గట్టి వారు లేకపోతే దాని ప్రభావం అసెంబ్లీ అభ్యర్ధులపై పడుతుంది. అందుకనే జగన్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.