అయ్యయ్యో.. రోజురోజుకూ బీజేపీ పరిస్థితి దిగజారిపోతోంది. ఆ పార్టీ అగ్రనేతలు ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాలు తమ ప్రాభవం కోల్పోతున్నారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది నిజం. నార్త్లో ఉప ఎన్నికల్లో వరుస దెబ్బలతో పాటు కర్ణాటకలో అధికారం కోసం ఆ పార్టీ జాతీయ నాయకత్వం పన్ని పన్నాగాలు, ఎత్తులు ప్లాప్ అవ్వడంతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట మసకబాబరుతోంది. ఇక కర్ణాటకలో గెలిచి బీజేపీ ఇక్కడ పట్టు సాధించాలని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కూడా తడాఖా చూపించాలని బీజేపీ వేసిన ప్లాన్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.
ఇక తాజా అప్డేట్ విషయానికి వస్తే దక్షిణాదిన ఆ పార్టీకి గడ్డుకాలమే. ఇందుకు నిదర్శనమే ‘ఏబీజీ-సీఎస్డీఎస్ సర్వే’ ఫలితాలు. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందా..? యూపీఏ పరిస్థితి ఏమిటి..? ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఏ మేరకు ఉంటుందన్న ప్రశ్నలకు ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనం దక్షిణాదిని తీసుకుంటే.. ఎలాగైనా కర్ణాకటలో గెలిచి, దక్షిణాదిన పాగా వేయాలని చూసిన కమలదళం బొక్క బోర్లా పడింది.
ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే దక్షిణాదిన బీజేపీకి వచ్చే సీట్ల సంఖను ఒకసారి చూస్తే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలిసిపోతోంది. దక్షిణాదిన ఉన్న మొత్తం 132 సీట్లలో ఎన్డీయే కూటమికి 18-22 సీట్లు, యూపీయే కూటమికి 67-75 సీట్లు, ఇతరులకు 38-44 దాకా సీట్లు రావచ్చునని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కర్ణాకటలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో అడ్డదారుల్లో వెళ్లి బీజేపీ అభాసుపాలైన విషయం తెలిసింది.
కన్నడనాట ఆ పార్టీ వ్యవహార శైలిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కమలదళానికి కర్ణాటక ఎఫెక్ట్ తప్పదని ఈ సర్వేతో తేలిపోయింది. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని ఆంధ్రులు ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న కోపంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. అలాగే తమిళనాడులో తూత్తకుడి జిల్లా స్టెరిలైట్ ఘటనతో కేంద్రంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఏబీజీ-సీఎస్డీఎస్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వివరాలను ఒకసారి చూద్దాం... ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి 274 సీట్లు, యూపీయే కూటమిని 164 సీట్లు, ఇతరులకు 105 సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. ఎన్డీఏకి 37%, యూపీఏకు 31%, ఇతరులకు 32% ఓట్లు లభిస్తాయని సర్వేలో పేర్కొంది. ఇక ప్రజాకర్షక నేతల్లో అందరికంటే మోదీ ముందున్నారు. కానీ ఆ శాతం నానాటికీ తగ్గుతుండడం గమనార్హం. 2017 మేలో ఆయన ప్రజాకర్షణశక్తి 44% ఉండగా, ఈ ఏడాది జనవరిలో అది 37%కి తగ్గింది. తాజాగా అది 34%కి పడిపోవడం గమనార్హం. ఇదే సమయంలో రాహుల్గాంధీ ప్రజాకర్షణశక్తి 16% నుంచి 24%కి పెరిగినట్లు సర్వే వెల్లడించింది.