ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే మీడియా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతోంది. రానున్న ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయటానికి టిడిపి మీడియా నానా అవస్తలు పడుతోంది. అందుకు భారతీయ జనతా పార్టీపై జనాల్లో వ్యతిరేకతను పెంచి పోషించటానికి నానా తంటాలు పడుతోంది. అందుకు ఆ సంస్ధ సర్వే అని ఈ సంస్ధ సర్వే జనాలపైకి రుద్దుతోంది. తాజాగా చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియాలో ఓ ప్రముఖ మీడియా అదే పని చేసింది. మోడి మనకు నచ్చలేదు అనే హెడ్డింగ్ పెట్టి ఓ పెద్ద కథనమే అచ్చేసింది. ఆ కథనంలో ఒక్క ఏపినే అంటే బాగుండడనుకున్నారో ఏమో తెలంగాణాను కూడా కలిపి తెలుగు రాష్ట్రాలంటూ కథలు చెప్పారు. తామ చేసిన సర్వే అంటే జనాలు నమ్మరని అనుమానం వచ్చిందే ఏమో లోక్ నీతి-సీఎస్ డిఎస్ సంస్ధ జరిపిన సర్వే అని చెప్పింది.
బిజెపికి ఎప్పుడూ ఆధరణ లేదు
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి ఆధరణ నానాటికి తగ్గిపోతుందని చెప్పటం. బిజెపికి తగ్గుతున్న ఆధరణ ప్రతిపక్షాలకు కాకుండా అధికార పార్టీల వైపు మొగ్గు చూపుతోందట. ఏపిలో బిజెపికి తగ్గిన ఆధరణ వైసిపికి కాకుండా తెలుగుదేశంకు దక్కుతోందట. బిజెపిపై వ్యతిరేకత పెరుగుతోందంటే నమ్మవచ్చు కానీ ఆ వ్యతిరేకత టిడిపికి అనుకూలంగా మారుతోందంటే నమ్మటం కష్టంగా ఉంది. ఎందుకంటే, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లో మొన్నటి వరకూ అంటే నాలుగేళ్ళపాటు బిజెపి-టిడిపిలు కలిసే అధికారాన్ని అనుభవించాయన్న సంగతి సర్వే సంస్ధ మరచిపోయిందేమో. పోయిన ఎన్నికల్లో మోడి-చంద్రబాబులు ఇద్దరూ జనాలకు చాలా హామీలే ఇచ్చారు. వారిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. దానికి అదనంగా చంద్రబాబు ఆచరణ సాధ్యంకాని హామీలను చాలా ఇచ్చారు. కాపులను బిసిల్లో చేర్చటం, బోయలను ఎస్టీల్లో చేర్చటం, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రుణమాఫి లాంటి హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా నెరవేర్చలేదు. కొన్నైఏ అసలు మొదటి అడుగు కూడా వేయలేదు. ఇటువంటి నేపధ్యంలో మోడి-చంద్రబాబు జాయింట్ గా హామీలిచ్చిన ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, రాజధాని నిర్మాణం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
బిజెపి-టిడిపిలపై మండుతున్న జనాలు
ఇటువంటి నేపధ్యంలో జనాలు అటు బిజెపి ఇటు టిడిపిలపై మండిపోతున్నారన్నది నిజం. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు పెరుగుతున్న ప్రజాధరణే ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటుంది. అదేమిటంటే, సదరు మీడియా మరచిపోయిందేమిటంటే తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి ఎప్పుడూ ఆధరణ లేదు. ఏదో గాలి కొట్టినపుడు ఓ నాలుగు స్ధానాలు గెలుచుకోవటం లేకపోతే డిపాజిట్లు కూడా కోల్పోవటం అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందని జనాలు అనుకుంటే అందులో చంద్రబాబుకు కూడా భాగస్వామ్యం ఉంటుందనటంలో సందేహమే అవసరం లేదు. కాబట్టి జనాగ్రహం ఒక్క బిజెపి పైన మాత్రమే ఉండదు. చంద్రబాబు పైన కూడా ఉంటుంది.
జనాగ్రహం కనబడకుండా మీడియా అవస్తలు
చంద్రబాబుపై వ్యతిరేకతను తగ్గించేందుకు టిడిపికి మద్దతిచ్చే మీడియా నానా అవస్తలు పడుతున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. ప్రభుత్వంపైన ఉండే జనాగ్రహం కచ్చితంగా ప్రతిపక్షాలకే లాభిస్తుంది. కాకపోతే ప్రతిపక్షాలు ఎక్కువైపోయి ఓట్లు చీలిపోతే మళ్ళీ అధికార పార్టీనే లాభపడే అవకాశం కూడా ఉంది. అయితే, ఆ అవకాశం వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఉంటుందా అన్నది ఇపుడే చెప్పలేం. ఇప్పటికైతే ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత తీవ్రస్ధాయిలో ఉందన్నది మాత్రం అందరికీ అర్ధమవుతోంది. ఆ విషయం చంద్రబాబుకు, మద్దతిచ్చే మీడియాకు కూడా బాగా తెలుసు. అందుకే ఇప్పటి నుండే బిజెపిపై వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకత అంతా చంద్రబాబుకు అనుకూలంగా మారుతోందని బాకాలూదుతోంది. ఒక విధంగా వైసిపికి వ్యతిరేకంగా టిడిపికి అనుకూలంగా జనాల మైండ్ సెట్ చేయటానికి చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియా పెద్ద బాధ్యతనే నెత్తునేసుకున్న విషయం తెలిసిపోతోంది.